హైడ్రోజన్‌ రైలు.. కొత్త వేగానికి కసరత్తు | India Hydrogen Train to Run 110 kmph Railway Board chief | Sakshi
Sakshi News home page

హైడ్రోజన్‌ రైలు.. కొత్త వేగానికి కసరత్తు

Sep 6 2026 7:36 PM | Updated on Sep 6 2026 7:42 PM

India Hydrogen Train to Run 110 kmph Railway Board chief

భారత రైల్వేలో మరో కీలక మార్పుకు రంగం సిద్ధమవుతోంది. దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన హైడ్రోజన్‌ ఆధారిత రైలును త్వరలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ రైలు గరిష్ఠంగా 75 కి.మీ వేగంతో నడుస్తుండగా.. ఇప్పటికే 120 కి.మీ వేగంతో హైస్పీడ్‌ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయని రైల్వే బోర్డు చైర్మన్‌, సీఈఓ సతీష్ కుమార్ వెల్లడించారు.

ఇండోర్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. 120 కి.మీ వేగంతో ట్రయల్స్‌ పూర్తయిన నేపథ్యంలో, ఇక 110 కి.మీ వేగాన్ని ఆపరేషనల్‌ స్పీడ్‌గా తీసుకురావడంపై కసరత్తు జరుగుతోందని తెలిపారు. కొత్త హైడ్రోజన్ రైలును ఏయే మార్గాల్లో నడపాలనే అంశంపై సంబంధిత వర్గాలతో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇందుకు అవసరమైన సాంకేతిక అంశాలతో పాటు హైడ్రోజన్ ఇంధన సరఫరా మౌలిక వసతులను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

భారత్‌ తొలి స్వదేశీ హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ గత జూలై 17న హర్యానాలోని జింద్‌ నుంచి సోనిపట్‌ మధ్య ప్రారంభించారు. ఈ రైలు 89 కిలోమీటర్ల జింద్‌–సోనిపట్‌ మార్గంలో నడుస్తోంది. సాధారణ ఎలక్ట్రిక్‌ రైళ్లు ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ లైన్ల నుంచి శక్తిని పొందుతాయి. హైడ్రోజన్‌ రైలులో మాత్రం హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ మధ్య రసాయన చర్య ద్వారా రైలులోనే విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది.

వందే భారత్ స్లీపర్‌పైనా కీలక అప్‌డేట్‌

వందే భారత్‌ స్లీపర్‌ రైళ్ల విషయంలోనూ రైల్వే కీలక విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో తొలి వందే భారత్‌ స్లీపర్‌ హౌరా–కామాఖ్య (గువాహటి) మార్గంలో నడుస్తోంది. మరో నాలుగు రైళ్లు తయారై ఉండగా, వాటిని త్వరలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు సతీష్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది మరో 11 వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

అంతేకాకుండా పీపీపీ విధానంలో 200 వందే భారత్‌ స్లీపర్‌ రైళ్ల తయారీ జరుగుతోందని, ఒక్కో రైలును పూర్తి చేయడానికి సుమారు ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతుందని ఆయన చెప్పారు. ఇక 2028లో ఉజ్జయినిలో జరిగే సింహస్థ మహోత్సవం 100 నుంచి 125 ప్రత్యేక రైళ్లను నడిపే ప్రణాళిక ఉందని తెలిపారు. అదే సమయంలో రైల్వే స్టేషన్లు, రైళ్లలో భద్రతను మరింత పెంచేందుకు సీసీటీవీ వ్యవస్థలను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానించే పనులు జరుగుతున్నాయి. రైళ్లలో ఎలుకల సమస్యను పరిష్కరించడంతో పాటు ప్రస్తుత మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంపైనా దృష్టి పెట్టినట్లు రైల్వే బోర్డు చైర్మన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement