హైదరాబాద్: తల్లిదండ్రుల కళ్లెదుటే రైలు ఢీకొని కూతురు మృతి చెందిన ఘటన మౌలాలి రైల్వేస్టేషన్లో ఆదివారం చోటుచేసుకుంది. ఉన్నత చదువులు పూర్తి చేసి పెద్ద దిక్కుగా ఉంటుందని సంతోషపడుతున్న తరుణంలో ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. సికింద్రాబాద్ జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ రాజు చెప్పిన వివరాల ప్రకారం..
జనగామ జిల్లాకు చెందిన మానెపల్లి ప్రకాశ్ తాపీమేస్త్రీ. ఉపాధి కోసం నగరానికి వచ్చి కుటుంబంతో నేరెడ్మెట్లో నివాసం ఉంటున్నాడు. ఆయన రెండో కూతురు మానస బంజారాహిల్స్లోని నర్సింగ్ కళాశాలలో రెండు నెలల క్రితం కోర్సు పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం భార్య, కూతురు మాసన (20)ను తీసుకుని ప్రకాశ్ స్వగ్రామం వెళ్లారు. ఆదివారం గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలులో వచ్చి మౌలాలి రైల్వేస్టేషన్ 2వ ప్లాట్ఫాంపై వీరు ముగ్గురు దిగారు.
పట్టాలు దాటి 1వ ప్లాట్ఫాంపైకి వచ్చేందుకు బయలుదేరారు. 2వ ప్లాట్ఫాం చివరన ఉన్న కాలిబాట వద్దకు చేరుకుంటున్న సమయంలో విశాఖ నుంచి వేగంగా వస్తున్న వందేభారత్ రైలును గమనించిన ప్రకాశ్ దంపతులు పక్కన ఆగిపోయారు. రైలు రాకను గమనించని మానస పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో మానస అక్కడికక్కడే మృతి చెందింది.


