రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాను మూడు సెకన్లలో డబ్బు సంపాదించానని పేర్కొన్నారు. అదెలాగో కూడా వివరించారు.
కియోసాకి ప్రకారం.. ఒక స్టాక్ పొజిషన్ను అమ్మి, ఆ నగదును ఖాతాలో జమ చేసుకోవడానికి 3 సెకన్ల సమయం పట్టింది. స్టాక్స్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బు అంత త్వరగా అందుతుంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే.. ఆస్తి విలువ పెరగడం ద్వారా సంపదను సృష్టించుకోవచ్చు. కానీ.. ఆ ఆస్తిని అమ్మాలంటే కొనుగోలుదారుడు దొరకాలి, బ్యాంక్ లోన్ ప్రక్రియ పూర్తవ్వాలి, ఇన్స్పెక్షన్, డాక్యుమెంటేషన్, క్లోజింగ్ వంటి ఎన్నో దశలు ఉంటాయి. కాబట్టి మన డబ్బు వెంటనే చేతికి రాదు.
స్టాక్స్ విషయానికి వస్తే.. ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మార్కెట్లో కొనుగోలు చేయడం, విక్రయించడం చాలా వేగంగా జరుగుతుంది. అందుకే కియోసాకి స్టాక్స్ను తన పెట్టుబడి వ్యూహంలో ఒక భాగం అని అన్నారు.
స్టాక్స్లో పెట్టుబడులకు మూడు ముఖ్యమైన ప్రయోజనాలను కియోసాకి పేర్కొన్నారు.
మొదటిది అందుబాటు ధర. రియల్ ఎస్టేట్లా భారీ మొత్తంలో డబ్బు అవసరం లేకుండానే.. చిన్న మొత్తంలోనే కొన్ని స్టాక్స్ కొనుగోలు చేసుకోవచ్చన్నమాట.
రెండోది లిక్విడిటీ. అవసరమైనప్పుడు స్టాక్ను విక్రయించి డబ్బును త్వరగా పొందే అవకాశం ఉంటుంది.
మూడోది వేగం. పెట్టుబడుల గురించి నేర్చుకోవడానికి సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం లేదని, కొంతకాలం నేర్చుకున్న తర్వాత చిన్న మొత్తాలతో ప్రారంభించవచ్చు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నిజమైన డబ్బు పెట్టుబడి పెట్టే ముందు సిమ్యులేటర్లో ప్రాక్టీస్ చేయవచ్చని కియోసాకి పేర్కొన్నారు. మార్కెట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకున్న తర్వాతే.. అసలు డబ్బుతో ప్రారంభించడం మంచిది. ఉద్యోగంలో ఉంటే జీతం కోసం ఒక నిర్దిష్ట తేదీ వరకు ఎదురుచూడాలి. కానీ పెట్టుబడుల ద్వారా తమ డబ్బును వివిధ మార్గాల్లో పనిచేయించుకోవచ్చని ఆయన అభిప్రాయం. తాను స్టాక్స్ ద్వారా వేగంగా క్యాష్ఫ్లో సృష్టించి, ఆ డబ్బును ఇతర పెట్టుబడులు, ఆస్తులను పెంచుకోవడానికి ఉపయోగించానని చెబుతూ.. సరైన సమయం కోసం ఎదురుచూడటం కంటే, పెట్టుబడులపై అవగాహన పెంచుకుని క్రమంగా ముందుకు సాగడం ముఖ్యమని సూచిస్తున్నారు.
పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు.. తప్పకుండా కొంత అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ లాభాలు మాత్రమే కాదు, భారీ నష్టాలు కూడా ఉంటాయి. సోషల్ మీడియా కథనాలు లేదా వీడియోలు చూసి.. పెట్టుబడులు పెడితే మాత్రం నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: పసిడి ప్రియులకు షాక్.. రూ.4600 పెరిగిన బంగారం!


