ప్రముఖ రచయిత, పెట్టుబడులపై అవగాహన కల్పించే రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారం ప్రాధాన్యంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కియోసాకి.. తన ఫేస్బుక్ ఖాతాలో చేసిన ఓ పోస్టులో తాను బంగారంతో 4.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ.40 కోట్లకు పైగా) విలువైన ఇంటిని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
ఇంటి ధర 4.5 మిలియన్ డాలర్లు కాగా, దాన్ని సొంతం చేసుకోవడం కోసం తాను వినియోగించిన బంగారాన్ని అప్పట్లో 4.5 లక్షల డాలర్ల కొన్నట్లు రాసుకొచ్చారు. అంటే తాను 4.5 లక్షల డాలర్లకే కొన్న బంగారంతో ఇప్పుడు 45 లక్షల డాలర్ల విలువైన ఇంటిని కొనుగోలు చేశానన్నది ఆయన భావన. బంగారం విలువ ఎంతలా పెరిగిందో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు.
ఇది ఎలాంటి ఫోర్క్లోజర్ లేదా ప్రత్యేక డీల్ కాదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా తాను బంగారు నాణేలను పొదుపు చేస్తూ వచ్చానని, వాటి విలువ పెరగడంతో చివరకు ఆ బంగారాన్ని ఇంటి కొనుగోలుకు ఉపయోగించానని పేర్కొన్నారు.
ప్రస్తుతం వెండి ఔన్సుకు 45 డాలర్లు, బంగారం ఔన్సుకు 3,500 డాలర్ల స్థాయిలో ఉన్నాయని కియోసాకి తన పోస్టులో పేర్కొన్నారు. అయితే తాను వెండిని ఔన్సుకు కేవలం ఒక డాలర్ ఉన్నప్పటి నుంచే కొనుగోలు చేసి పొదుపు చేయడం ప్రారంభించానని చెప్పారు. సంప్రదాయ కరెన్సీపై ఆధారపడటానికి బదులుగా బంగారం, వెండి వంటి విలువైన ఆస్తులను కూడబెట్టుకోవడంపై తనకు నమ్మకం ఉందన్నారు.
బ్యాంకులో డబ్బు దాచుకోవడం, కష్టపడి పనిచేయడం వంటి సంప్రదాయ ఆర్థిక సలహాలపై కూడా కియోసాకి విమర్శలు చేశారు. ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో కరెన్సీని ముద్రించడం వల్ల దాని విలువ క్రమంగా తగ్గుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగితపు డబ్బు విలువను కోల్పోతున్న సమయంలో బంగారం, వెండి వంటి ‘రియల్ మనీ’, రియల్ అసెట్స్లో పొదుపు చేయడం ప్రయోజనకరమని పేర్కొన్నారు.
తాను ఏళ్లుగా బంగారాన్ని పొదుపు చేయడం వల్లే దాన్ని ఉపయోగించి భారీ విలువైన ఆస్తిని కొనుగోలు చేయగలిగానని కియోసాకి తెలిపారు. డాలర్లను పొదుపు చేయాలా, లేక బంగారం, వెండి వంటి విలువైన ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలా అనేది వ్యక్తిగత నిర్ణయమని తన పోస్టులో పేర్కొన్నారు.


