న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2026–27) బడ్జెట్ లక్ష్యానికి అనుగుణంగా డిజిన్వెస్ట్మెంట్, ఆస్తుల మానిటైజేషన్ సాగుతోంది. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లోనే రూ. 80,000 కోట్ల సమీకరణ టార్గెట్లో 78 శాతాన్ని(రూ. 62,124 కోట్లు) ప్రభుత్వం సాధించింది. దీనిలో భాగంగా 9 పీఎస్యూలలో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 55,757 కోట్లు సమకూర్చుకుంది. వీటిలో ఎల్ఐసీ, ఇంధన రంగ దిగ్గజం కోల్ ఇండియా ఉన్నాయి.
వీటితోపాటు ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాస్యూటికల్స్ కార్పొరేషన్ వ్యూహాత్మక విక్రయం, ఎస్యూయూటీఐ నుంచి రెమిటెన్సులు సైతం జాబితాలో చేరాయి. ప్రధానంగా ఎల్ఐసీలో 6.5 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 31,515 కోట్లు లభించాయి. కోల్ ఇండియాలో 2 శాతం వాటా అమ్మకంతో మరో రూ. 5,542 కోట్లు సమీకరించింది. ఎన్హెచ్పీసీలో 6 శాతానికిపైగా వాటా అమ్మడంతో రూ. 4,357 కోట్లు జమయ్యాయి.
తాజాగా హింద్ కాపర్
ఈ వారం మొదట్లో మైనింగ్ రంగ పీఎస్యూ హిందుస్తాన్ కాపర్లో ఓఎఫ్ఎస్ ద్వారా ప్రభుత్వం 6 శాతం వాటా విక్రయించిన విషయం విదితమే. దీంతో రూ. 3,041 కోట్లు సమకూరాయి. ఇప్పటికే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్ఎల్సీ ఇండియా, జీఐసీ, ఐఆర్ఎఫ్సీ, కొచ్చిన్ షిప్యార్డ్లో వాటాలు విక్రయించింది. ఇని్వట్ ఆస్తుల మానిటైజేషన్ ద్వారా రూ. 6,367 కోట్లు లభించగా.. డిజిన్వెస్ట్మెంట్, ఆస్తుల మానిటైజేషన్ ద్వారా ప్రభుత్వం మొత్తం రూ. 62,124 కోట్లు సమీకరించింది. ఇది బడ్జెట్ లక్ష్యం రూ. 80,000 కోట్లలో 78 శాతంకావడం గమనార్హం! ఇప్పటికే ఐడీబీఐ బ్యాంక్లో వ్యూహాత్మక వాటా విక్రయ అంశాన్ని చేపట్టింది. ఈ ఏడాది మొదట్లో ఈ సన్నాహాలు విఫలమైనప్పటికీ దుబాయ్ కంపెనీ ఎమిరేట్స్ ఎన్డీబీ, ప్రేమ్వత్సా సంస్థ ఫెయిర్ఫాక్స్ హోల్డింగ్స్ సవరించిన బిడ్స్ దాఖలు చేశాయి.


