ముంబై నగరవాసులకు పాలు మరింత ప్రియం కానున్నాయి. స్థానిక పశువుల షెడ్లు, డెయిరీల నుంచి నేరుగా సరఫరా చేసే ‘టబెలా’ పాల టోకు ధరను పెంచాలని ముంబై మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (MMPA) నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుంచి లీటర్ టోకు ధరను ప్రస్తుతం ఉన్న రూ.93 నుంచి రూ.102కు పెంచనుంది. అంటే లీటర్పై రూ.9 పెరుగుదల. ఈ ధరలు 2027 ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటాయి.
టోకు ధర పెరగడంతో వినియోగదారులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం సుమారు రూ.100కు లభిస్తున్న ఈ పాలు.. కొత్త ధరల అమలుతో రిటైల్ మార్కెట్లో లీటర్కు దాదాపు రూ.110 వరకు చేరొచ్చని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఎందుకు పెంచారంటే..
పశువుల పెంపకం, పాల ఉత్పత్తికి సంబంధించిన ఖర్చులు భారీగా పెరగడమే ధరల సవరణకు ప్రధాన కారణమని అసోసియేషన్ వెల్లడించింది. పశుదాణాలో ఉపయోగించే ధాన్యాలు, చుని, శనగ చుని, మొక్కజొన్న, నూనెగింజల పిండి (ఆయిల్ కేక్స్), పచ్చి గడ్డి వంటి వాటి ధరలు గణనీయంగా పెరిగాయని తెలిపింది. కొన్ని దాణా పదార్థాల ధరలు ఏడాది వ్యవధిలో దాదాపు 25 శాతం వరకు పెరిగినట్లు అసోసియేషన్ పేర్కొంది. పశువుల నిర్వహణ, రవాణా తదితర ఖర్చులు కూడా పెరగడంతో పాత ధరలకు పాలు విక్రయించడం కష్టంగా మారిందని తెలిపింది.
పండుగల వేళ మరింత భారం
సెప్టెంబర్లో గణేశ్ చతుర్థి సహా పండుగల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ధరల పెంపు రావడం గమనార్హం. ఈ సమయంలో పాలు, పెరుగు, స్వీట్లు, లస్సీ, ఇతర పాల ఉత్పత్తులకు డిమాండ్ సాధారణంగా పెరుగుతుంది. దీంతో పాలు మాత్రమే కాకుండా పాల ఆధారిత ఆహార పదార్థాల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.


