భాగ్యనగరంలో భూముల జోరు
రికార్డు ధరలకు స్థలాల కొనుగోళ్లు
సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగరం రియల్ ఎస్టేట్ సామ్రాజ్యానికి తిరుగులేదని మరోసారి నిరూపితమైంది. హైదరాబాద్ నగరంలో భూమి బంగారం కంటే వేగంగా విలువను పెంచుకుంటోంది. నగర పశ్చిమ ప్రాంతంలోని ఐటీ కారిడార్లో భూములను దక్కించుకోవడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి డెవలపర్లు భారీగా పోటీ పడుతున్నారు.
హైదరాబాద్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీ)లకు కేరాఫ్ అడ్రస్గా మారడం, భవన నిర్మాణాల ఎత్తు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)పై ఆంక్షలు లేకపోవడం, గ్రేడ్–ఏ ఆఫీస్ స్థలాలకు విపరీతమైన గిరాకీ ఉండటమే పశ్చిమ హైదరాబాద్లో భూముల డిమాండ్కు ప్రధాన కారణాలని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఐటీ
హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మెట్రో రైల్ సదుపాయం, ఔటర్ రింగ్ రోడ్డుకు ఈ ప్రాంతాలు అత్యంత సమీపంలో ఉండటంతో అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యాలయాల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో జాతీయ, అంతర్జాతీయ బిల్డర్లు నగరంలో నివాస, వాణిజ్య సముదాయాల నిర్మాణాలపై దృష్టి సారించారు.
ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి కొనసాగుతుండటంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగించిందనే అంచనాలను తలకిందులు చేస్తూ, దేశంలోనే అత్యంత డైనమిక్ నగరంగా హైదరాబాద్ మరోసారి తన పట్టును నిరూపించుకుంది. ఈ స్థాయిలో భూముల ధరలు పెరగడంతో భవిష్యత్తులో ఇళ్లు, ఫ్లాట్ల ధరలు మరింత ప్రియమయ్యే అవకాశం ఉంది.
ఈ నెల 21న రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ పరిసరాల్లో 5.38 ఎకరాల మల్టీ–యూజ్ (వాణిజ్య, నివాస) భూమిని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఆన్లైన్ వేలం వేయగా. ఎకరానికి రూ.264 కోట్లు పలికింది. అలాగే శుక్రవారం (ఆగస్ట్ 28) కూడా ఇక్కడ ఎకరం ధర రికార్డు స్థాయిలో రూ.269 కోట్లు పలికింది. ఇది దేశంలోనే ప్రభుత్వ వేలంలో నమోదైన అత్యధిక రికార్డు ధరల్లో ఒకటిగా నిలిచింది.


