ముంబై: మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో జరిగిన ఒక పాఠశాల వేడుకలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రసన్న బి. వరాళే ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు భారీ ప్రాజెక్టులపై వెచ్చించే నిధులలో అత్యంత స్వల్ప భాగం కేటాయిస్తేనే రాష్ట్రంలో మూతపడుతున్న ఎన్నో పాఠశాలలను రక్షించవచ్చని ఆయన హితవు పలికారు.
మహారాష్ట్ర ప్రభుత్వం నాసిక్-సింహస్థ (కుంభ్) మేళా కోసం అత్యంత భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తోందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమం కోసం ఏకంగా రూ.32వేల కోట్ల నుంచి రూ.34వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు ప్రస్తావించారని తెలిపారు. అలాగే మరో కారిడార్ ప్రాజెక్ట్ నిమిత్తం రూ.11వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసిన ఆయన.. ఈ భారీ కేటాయింపులలో కేవలం 0.1 శాతం (సుమారు రూ. 32 కోట్లు) విద్యా రంగానికి వెచ్చించినా, రాష్ట్రవ్యాప్తంగా మూతపడే దశలో ఉన్న 100 నుంచి 125 మరాఠీ మీడియం పాఠశాలలను సులభంగా కాపాడగలిగేవాళ్లమని గణాంకాలతో సహా వివరించారు.
కాలక్రమేణా విద్యా రంగానికి కేటాయించే బడ్జెట్ కేటాయింపులు తగ్గిపోవడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, దానికి తగినట్లుగా మౌలిక వసతులు, బడ్జెట్ పెరగకపోవడం గమనించదగ్గ విషయమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు లేక నేల మీద పడుకున్న ముగ్గురు బాలికలు, పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేస్తూ.. అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యారంగంలో ప్రాథమిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.


