ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫారాలపై హరీశ్రావు
‘సాక్షి’ కథనాన్ని ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన మాజీమంత్రి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కనీసం నాణ్యమైన యూనిఫారాలు కూడా అందించలేని దుస్థితిలో ఉందని మాజీమంత్రి టి.హరీశ్రావు విమర్శించారు. ‘ఊడిన కుట్లు.. కొలతల పాట్లు’అనే శీర్షికతో ఆదివారం ‘సాక్షి’ప్రధాన సంచికలో వచ్చిన కథనాన్ని ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో యూనిఫారాలు అందలేదని, అందిన చోట్ల కూడా కొలతలు సరిగ్గా లేకపోవడంతోపాటు కుట్లు ఊడిపోతున్నాయని ఆరోపించారు. ఉతికితే రంగులు వెలిసిపోతున్నాయన్నారు.
విద్యార్థులకు రెండు జతల యూనిఫారాలు ఇవ్వాల్సి ఉండగా.. చాలాచోట్ల ఒక్క జత కూడా పూర్తిగా అందలేదని తెలిపారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేలా స్థానికంగా యూనిఫారాల తయారీకి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా.. కమీషన్ల కోసం బడా కార్పొరేట్ల నుంచి నాసిరకం యూనిఫారాలు తెప్పించారని హరీశ్రావు ఆరోపించారు. రేవంత్రెడ్డికి గుజరాత్ దళారులపై ఉన్న ప్రేమ తెలంగాణ చేనేత కార్మికులపై లేదని విమర్శించారు. ‘మఫత్లాల్ ముద్దు.. చేనేత వద్దు’ అన్నదే ప్రభుత్వ విధానమా అని ప్రశ్నించారు.
ఒకవైపు చేనేత కార్మికుల ఉపాధికి గండి పడుతుండగా.. మరోవైపు విద్యార్థులకు నాసిరకం యూనిఫారాలు అందుతున్నాయన్నారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు, చేనేత కార్మికులకు ఉపాధి నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. నాసిరకం యూనిఫారాల వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హరీశ్రావు డిమాండ్ చేశారు.
ఆరోగ్యశ్రీపై ఎందుకంత కక్ష రేవంత్రెడ్డీ?
ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడంలో సిబ్బందికి జీతాలు చెల్లించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ‘ఆరోగ్యశ్రీపై ఎందుకంత కక్ష రేవంత్రెడ్డీ? ఆరోగ్యశ్రీ సిబ్బంది ఆవేదన వింటే గుండె కలిచి వేస్తోంది. నెలల తరబడి జీతాల్లేకుండా సిబ్బంది ఎలా బతకాలి? పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు, కుటుంబ ఖర్చులు ఎలా భరించాలి? ప్రతి నెలా 1వ తేదీకే వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ, ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయడం లేదు’అని ఆదివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరోగ్యశ్రీ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని గొప్పగా ప్రకటించారని, అది ప్రకటనలకే పరిమితమైందని హరీశ్ ఆరోపించారు.


