సాక్షి,హైదరాబాద్: కొండా సురేఖ తన కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినా తనకు నోటీసులిచ్చిన నేపధ్యంలో నేడు(ఆదివారం) మద్యాహ్నం మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను బెంగళూరులో కలిశారు. తనపై, తన కుటుంబంపై రాజకీయ కుట్ర చేస్తున్నట్లు వాపోయినట్లు సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే తాను రెండుసార్లు వివరణ కూడా ఇచ్చానని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ, గాంధీ ఫ్యామిలీని తను విమర్శించలేదని ఖర్గేకు వివరణ ఇచ్చారు. అయితే ఏది చెప్పినా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకే చెప్పుకోవాలని,పార్టీకీ నష్టం కలిగించేలా మాట్లాడటం సరికాదని ఖర్గే కొండా సురేఖకు సూచించారని తెలుస్తోంది.
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో ఉండగా.. నేడు రాత్రి ఆయన హైదరాబాద్కు తిరిగి రానున్నారు. సీఎం రాకతో కొండా వ్యవహారంపై కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ నాయకత్వం ఇప్పటికే ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో.. సీఎం సమక్షంలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.
ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత.. మరోవైపు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం కోసం ఎదురుచూపులు.. ఇంకోవైపు మంత్రి కొండా సురేఖ వరుస లేఖలు.. ఇలా కాంగ్రెస్లో కొండా ఫ్యామిలీ ఎపిసోడ్ ఉత్కంఠ రేపుతోంది. క్షమాపణ చెబుతారా? పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? లేక మరేదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా? అన్నదే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చగా మారింది. సీఎం హైదరాబాద్కు తిరిగొచ్చిన తర్వాత ఈ ఎపిసోడ్ ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.


