వైఫై, బ్లూటూత్, నెట్‌తో ఈవీఎంలను కనెక్ట్‌ చేయొచ్చా? | Are EVMs Hackable via Wi-Fi or Bluetooth CEC Gyanesh Kumar Responds | Sakshi
Sakshi News home page

వైఫై, బ్లూటూత్, నెట్‌తో ఈవీఎంలను కనెక్ట్‌ చేయొచ్చా?

Aug 24 2026 9:09 PM | Updated on Aug 24 2026 9:09 PM

Are EVMs Hackable via Wi-Fi or Bluetooth CEC Gyanesh Kumar Responds

భారత ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) పూర్తి సురక్షితమైనవని, వాటికి ఎలాంటి వైఫై, బ్లూటూత్ లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదని కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. లఖ్‌నవూలోని కాళ్వీన్ తాలుక్దార్స్ కళాశాలలో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఈవీఎంలపై వచ్చే పలు అనుమానాలకు సమాధానమిస్తూ భారతదేశంలో ఉపయోగించే ఈవీఎంలను ప్రభుత్వ రంగ సంస్థలే తయారు చేస్తాయని వెల్లడించారు. ఇవి ఇతర వైర్‌లెస్ సాంకేతికతలతో అనుసంధానం కావు కాబట్టి వీటిని హ్యాక్ చేయడం లేదా ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని తెలిపారు.

సోషల్ మీడియా ప్రచారాలపై అప్రమత్తత

సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందే సమాచారాన్ని గుడ్డిగా నమ్మవద్దని విద్యార్థులకు జ్ఞానేష్ కుమార్ సూచించారు. ఏ సమాచారాన్నైనా స్వీకరించే ముందు లేదా ఇతరులతో పంచుకునే ముందు దాని మూలం, ప్రామాణికతను తనిఖీ చేయడం ఎంతో అవసరమని అన్నారు. భారతదేశంలో సుమారు 100 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారని, ఇంత భారీ స్థాయిలో ఎన్నికలు నిర్వహించడం ఒక బృహత్తర కార్యమని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326ను ప్రస్తావిస్తూ, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువత భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ఆకాంక్షించారు.

అమెరికా వంటి దేశాల్లో భారత ఓటింగ్ విధానం, ఓటరు గుర్తింపు కార్డుల నిర్వహణపై ఇటీవల ప్రశంసలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఈసీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికల విధానాలపై ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ ఓటింగ్ ఆధారాలపై ఓటర్లు అవగాహన పెంపొందించుకోవాలని పౌరులకు సూచించారు.

ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement