నువ్వు చేసిన తప్పులకు క్షమాపణ కోరాల్సిందే
ఆమె క్షమిస్తే ఆశీర్వాదం తీసుకో
తల్లిదండ్రులను మోసం చేయడం సరైన పద్ధతి కాదు
తల్లిని వేధించిన కుమారుడికి సుప్రీంకోర్టు హితవు
సాక్షి, న్యూఢిల్లీ: ఆస్తి తన పేరిట రాయాలంటూ తల్లిదండ్రులను వేధించిన ఒక కుమారుడికి సుప్రీంకోర్టు హితవు పలికింది. తక్షణం ఆమె పాదాలపై పడి క్షమాపణ వేడుకో అని ఆ కుమారుడిని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. చేసిన పాపానికి క్షమాపణ కోరాల్సిందేనని కోర్టు ఆదేశించింది. తల్లిదండ్రులకు చెందిన భవనంలోని మొదటి అంతస్తు నుంచి ఖాళీ చేయాల్సిందేనంటూ ఏప్రిల్లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఒక వ్యక్తి వేసిన పిటిషన్ను కొట్టేస్తూ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్కె సింగ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలుచేసింది.
కేసు పూర్వాపరాల ప్రకారం.. తల్లిదండ్రుల పేరిట ఉన్న భవనంలో కుమారుడు, కోడలు మొదటి అంతస్తులో ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా ఆస్తిని తమ పేరున బదలాయించాలని కుమారుడు, కోడలు ఒత్తిడి చేసినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదుచేశారు. నకిలీ పత్రాల ఆధారంగా ఆస్తిపై యాజమాన్య హక్కులు తమకే దక్కుతాయని దబాయిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో విసిగిపోయిన కన్నవాళ్లు ఇక కుమారుడితో అన్ని రకాల బాంధవ్యాలు తెంచుకుంటున్నట్లు పత్రికలో బహిరంగ ప్రకటన సైతం ఇచ్చారు. ఆస్తి కావాలంటూ తీవ్రంగా వేధిస్తున్న కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మొదటి అంతస్తులో ఉండేందుకు గతంలో తాము ఇచి్చన అనుమతిని రద్దు చేస్తూ నోటీసు జారీ చేశారు. ఆస్తిని ఖాళీ చేయాలని ఆదేశించారు. ఆస్తిని స్వా«దీనం చేయాలని, ఇతరులు నివసించడంపై శాశ్వత నిషేధాజ్ఞలు విధిస్తున్నామని, ఇన్నాళ్లూ ఇంటిని ఉపయోగించుకున్నందుకు నష్టపరిహారం కోరుతూ తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఆస్తి తల్లిదండ్రులకే దక్కుతుందని, దానికి పూర్తి యజమానులు వారేనని విచారణ అనంతరం ట్రయల్ కోర్టు తేల్చిచెప్పింది. తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే ఇన్నాళ్లూ కుమారుడు, కోడలు ఆ భవంతిలో నివసించగలిగారని కోర్టు అభిప్రాయపడింది.
నివాస అనుమతిని చట్టబద్ధంగా రద్దు చేసినందున మొదటి అంతస్తును ఖాళీ చేయాల్సిందేనని తీర్పునిచి్చంది. ఈ తీర్పును కుమారుడు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా ఏప్రిల్ 17వ తేదీన అక్కడా చుక్కెదురైంది. కింది కోర్టు తీర్పునే హైకోర్టు సమరి్థంచింది. దీంతో కుమారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతని పిటిషన్ను కొట్టేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కుమారుడిని ఉద్దేశించి మౌఖిక ఆదేశాలిచ్చారు. ‘‘తల్లి కాళ్లకు నమస్కరించి క్షమాపణ కోరాల్సిందే. మీరు చేసిన తప్పులు, పాపాలకు ప్రాయశి్చత్తం చేసుకోవాల్సిందే. అమ్మకు సారీ చెప్పి క్షమాపణ కోరు. క్షమిస్తే ఆశీర్వాదం తీసుకో’’అని ధర్మాసనం సూచించింది. కుమారుడి తరఫున వాదించిన లాయర్లనుద్దేశిస్తూ ‘‘తల్లి విషయంలో కుమారుడు చేసింది తప్పు కాదంటారా?’’అని జడ్జి సూటి ప్రశ్న వేశారు.


