
ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్కు జపాన్ కోర్టులో చుక్కెదురైంది. గూగుల్ పేటెంట్ ఉల్లంఘించిందంటూ వేసిన దావాకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. జపాన్లో పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ఫోన్ల అమ్మకాలను నిషేధించాలని పేర్కొంది. పేటెంట్ పొందిన ఎల్టీఈ టెక్నాలజీని అనుమతి లేకుండా గూగుల్ చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తోందని ఆరోపిస్తూ ఇటీవల కోర్టులో వేసిన దావాకు అనుకూలంగా తీర్పు వెలువడింది.
ఈటీన్యూస్ ప్రచురించిన తాజా నివేదిక ప్రకారం.. 4జీ నెట్వర్క్లో ఉపయోగించే నిర్దిష్ట కమ్యూనికేషన్ పద్ధతిపై వివాదం మొదలైంది. ఎల్టీఈ టెక్నాలజీపై జపాన్లో ఇప్పటికే పేటెంట్ తీసుకున్నట్లు పాన్టెక్ సంస్థ దావాలో పేర్కొంది. దేశ చట్టాలకు విరుద్ధంగా గూగుల్ పిక్సెల్ ఫోన్లో ఈ టెక్నాలజీని వాడుతున్నట్లు తెలిపింది. దాంతో విచారణ జరిపిన జపాన్ కోర్టు ఆ దేశంలో పిక్సెల్ సిరీస్ ఫోన్లను నిషేధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ‘అక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్’ లేదా ఏసీకే అని పిలువబడే నియంత్రణ సిగ్నల్ పరికరాలు, బేస్ స్టేషన్ల మధ్య కమ్యునికేషన్ ఎలా ప్రసారం అవుతుందనే దానిపై కంపెనీ, దావా వేసిన వారిలో పరస్పరం భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి. ఈ ఎల్టీఈ టెక్నాలజీ జపాన్ పేటెంట్ చట్టం కింద సంరక్షించబడుతుంది. దాంతో జపాన్ కోర్టు చర్యలు తీసుకుంది.
ఇదీ చదవండి: పుత్తడి ప్రియుల్లో కోటి ఆశలు.. బంగారం తగ్గుముఖం
కోర్టులో దావా వేసిన పాన్టెక్ కంపెనీ స్వయంగా స్మార్ట్ ఫోన్ వ్యాపారం నుంచి నిష్క్రమించినప్పటికీ, దాని మిగిలి ఉన్న పేటెంట్లు ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నట్లు తెలిపింది. గూగుల్ పిక్సెల్ 7, 7 ప్రో సరైన లైసెన్సింగ్ లేకుండా ఈ సాంకేతికతను ఉపయోగించాయని టోక్యో డిస్ట్రిక్ట్ కోర్టు తెలిపింది. దాంతో ఈ మోడళ్ల అమ్మకాలపై మాత్రమే కాకుండా దిగుమతులు, ప్రకటనలు, జపాన్లో ఈ మోడళ్ల ప్రదర్శనపై కూడా నిషేధాన్ని విధించింది. విచారణ సందర్భంగా కంపెనీ ప్రవర్తనపై కోర్టు తీవ్ర విమర్శలు చేసింది. గూగుల్ది ‘చిత్తశుద్ధి లేని వైఖరి’గా అభివర్ణించింది.