
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తన పేరిట జరుగుతున్న మోసాల విషయంలో ఇన్వెస్టర్లను అప్రమత్తం చేసింది. సెబీ అధికారులమని చెప్పుకుంటూ కొందరు మోసగాళ్లు రెగ్యులేటర్ పేరు, లోగో, లెటర్హెడ్ను వాడుకుని, అమాయక ఇన్వెస్టర్లకు నకిలీ నోటీసులు పంపిస్తూ, మోసగిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు వివరించింది.
ఇదీ చదవండి: ఆర్బీఐ బాటలోనే బ్యాంక్లు
ఇన్వెస్టరు నిర్దిష్ట ఉల్లంఘనకు పాల్పడినందున చర్యలు తీసుకోకుండా ఉండాలంటే పెనాల్టీ కట్టాలంటూ సోషల్ మీడియా ప్లాట్ఫాం ద్వారా మోసగాళ్లు నకిలీ నోటీసులు పంపుతున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించాలని, తమకు ఇలాంటి సమాచారం వస్తే, సెబీ జారీ చేసిందా లేదా అనేది ధృవీకరించుకోవాలని తెలిపింది. తాము ఇచ్చే ప్రతి ఆర్డరుపైనా, పంపించే అన్ని లెటర్లు, నోటీసులు, షోకాజ్ నోటీసులు, సమన్లపైనా ఒక విశిష్ట రిఫరెన్స్ నంబరు ఉంటుందని సెబీ తెలిపింది. అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలు, ఆర్డర్లు, రికవరీ సర్టిఫికెట్లు అన్నీ తమ వెబ్సైట్లో ఉంటాయని పేర్కొంది.