ఎరువుల సబ్సిడీ రెట్టింపు | Global Geopolitics Climate Change AI Revolution Fertilizer Subsidy Burden | Sakshi
Sakshi News home page

ఎరువుల సబ్సిడీ రెట్టింపు

Jun 10 2026 1:40 PM | Updated on Jun 10 2026 1:56 PM

Global Geopolitics Climate Change AI Revolution Fertilizer Subsidy Burden

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, వాతావరణ మార్పులు, సాంకేతిక విప్లవం (ఏఐ) అంతర్జాతీయ వ్యాపార రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ఎరువుల సబ్సిడీ బిల్లు ఏకంగా రూ.3.4 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ప్రభుత్వ ఉన్నతాధికార వర్గాలు స్పష్టం చేశాయి.

భారత్‌పై సబ్సిడీ భారం

యూఎస్-ఇజ్రాయెల్-ఇరాన్ సంక్షోభం 100 రోజులు కావస్తుండడం, హార్మూజ్‌ జలసంధిలో రవాణా అంతరాయాలు, ఉత్పత్తి కేంద్రాల దెబ్బతినడం వల్ల అంతర్జాతీయంగా ఎరువుల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీ కోసం రూ.1.71 లక్షల కోట్లు కేటాయించగా ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇది రెట్టింపై రూ.3.4 లక్షల కోట్లకు చేరేలా ఉంది.

రైతాంగానికి ఊరట

ప్రభుత్వానికి భారం పెరిగినప్పటికీ రైతులపై పైసా భారం పడకుండా చర్యలు తీసుకున్నారు. 2018 నుంచి యూరియా ధర (45 కిలోల బస్తా) రూ.266.5 వద్దే స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఒక్కో బస్తాపై సబ్సిడీ రూ.4,000 దాటింది. డీఏపీ (50 కిలోల బస్తా) ధర కూడా రూ.1,350 వద్దే కొనసాగుతోంది.

ఆయిల్ కంపెనీలకు మద్దతు

గత 78 రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ.1.23 లక్షల కోట్ల మద్దతును అందిస్తోంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 తగ్గించడం ఇందులో భాగమే.

బడ్జెట్ పరిమితులు దాటని ద్రవ్యలోటు

ఈ అదనపు వ్యయాలు దేశ ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీయవని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2026-27 బడ్జెట్ రూపకల్పనలోనే ఇలాంటి అంతర్జాతీయ అనిశ్చితులను ముందే అంచనా వేసి వ్యూహాత్మకంగా నిధులను కేటాయించారు. బడ్జెట్‌లో నిర్దేశించుకున్న జీడీపీలో 4.3 శాతం ద్రవ్యలోటు లక్ష్యానికే ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అదనపు రుణాలు లేదా అనుబంధ గ్రాంట్ల అవసరం రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు.

రూ.1 లక్ష కోట్ల స్థిరీకరణ నిధి

ఊహించని ప్రపంచ పరిస్థితులను తట్టుకోవడానికి గత ఏడాది ఏర్పాటు చేసిన రూ.1 లక్ష కోట్ల ఆర్థిక స్థిరీకరణ నిధి ప్రస్తుతం కేంద్రానికి రక్షణ కవచంగా మారింది. దీని నుంచే విమానయాన సంస్థల కోసం రూ.10,000 కోట్ల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరల స్థిరీకరణ నిధిని కేటాయించారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దేశీయ యూరియా ప్లాంట్లకు తగినంత ఎల్‌ఎన్‌జీ సరఫరాను ప్రభుత్వం నిర్ధారించింది. ఇది సబ్సిడీ భారాన్ని కొంతవరకు తగ్గించనుంది.

ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టి

అదనపు సబ్సిడీల భారాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం పన్నుయేతర ఆదాయాలపై దృష్టి సారించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణ ప్రక్రియను ముమ్మరం చేసింది. ‘డీఐపీఏఎం(దీపమ్‌) , డీపీఈ విభాగాలు రాబోయే ఏడాది కాలానికి స్పష్టమైన కార్యాచరణతో ఉన్నాయి. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న బడ్జెట్ లక్ష్యం రూ.80,000 కోట్లను మించి ఆదాయం వస్తుందని భావిస్తున్నాం’ అని ప్రభుత్వ ఉన్నత అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: హ్యాట్రిక్‌ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement