కొనసాగుతున్న జంగిల్‌రాజ్‌ | TDP goons attacked house of BC leader Jogi Ramesh in Ibrahimpatnam | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న జంగిల్‌రాజ్‌

Feb 2 2026 4:58 AM | Updated on Feb 2 2026 10:08 AM

TDP goons attacked house of BC leader Jogi Ramesh in Ibrahimpatnam

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్‌ ఇంటిపై దాడి చేస్తున్న టీడీపీ గూండాలు

  • ఇబ్రహీంపట్నంలో బీసీ నేత జోగి రమేష్‌ ఇంటిపై టీడీపీ గూండాల దాడి

  • పెట్రోల్‌ బాంబులు, కత్తులు, బండరాళ్లు, కర్రలతో స్వైర విహారం 

  • దాడిలో పాల్గొన్న బ్లేడ్, గంజాయి బ్యాచ్‌ రౌడీ షీటర్లు 

  • పెట్రోల్‌ బాటిళ్లతో దాడులు చేస్తున్నా పట్టించుకోని పోలీసులు 

  • దాడి సమయంలో ఇంట్లోనే ఉన్న జోగి రమేష్‌ తండ్రి, కుటుంబ సభ్యులు 

  • దేవినేని అవినాష్‌ను అడ్డుకున్న పోలీసులు.. పచ్చ మూకలకు గ్రీన్‌ సిగ్నల్‌ 

  • రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన అవినాష్‌ 

  • బలవంతంగా అరెస్టు చేసి విజయవాడకు తరలింపు  

సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో జంగిల్‌ రాజ్‌ విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రశ్నిస్తున్న వారికి సమాధానం చెప్పలేక ఆటవిక పాలనను ఎంచుకున్నారు. తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబుదే తప్పు అన్న విషయం సీబీఐ సిట్‌ సాక్షిగా బట్టబయలు కావడంతో ప్రజల దృష్టిలో చులకనై, వారి దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్‌ సీపీ నేతలపై దాడులకు తన రౌడీలను పురమాయిస్తున్నారు. శనివారం గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై గూండాల దాడిని మరచిపోక ముందే ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్‌ ఇంటిపై విధ్వంసానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. పెట్రోల్‌ బాంబులతో బ్లేడ్, గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు, టీడీపీ మూకలు రమేష్‌ ఇంటిపై విరుచుపడి విధ్వంసం సృష్టించారు. 

వందలాది మంది రౌడీలు విధ్వంసం సృష్టిస్తుంటే నిలువరించాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తుండటం విస్తుగొలుపుతోంది. వెళ్లిపోండి.. వెళ్లిపోండి.. అంటూ వారిని బతిమిలాడటం పోలీసు వ్యవస్థ దీన స్థితిని తెలియజేస్తోంది.  రాష్ట్రంలో సాగుతున్నది ప్రజాస్వామ్యమా.. లేక ఆటవిక రాజ్యమా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. పైగా ఈ విధ్వంసకాండను చంద్రబాబు తనయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, సదరు టీడీపీ శ్రేణులు చెప్పుకుంటుండటం దారుణమని, ఇది అత్యంత ప్రమాదకర పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బలహీన వర్గాల గొంతు నులిమి రాక్షసానందం పొందుతూ ప్రశ్నించే తత్వాన్ని చంపేయడమే టీడీపీ పెద్దల లక్ష్యమనే భావన అత్యధికుల్లో వ్యక్తం అవుతోంది.

పక్కా ప్లాన్‌తోనే దాడి
ఆదివారం ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్‌ ఇంటిపై దాడి చినబాబు డైరెక్షన్‌లో పక్కా ప్లాన్‌తో జరిగింది. బీసీ నేత జోగి రమేష్‌ ఇంటిపై దాడికి ఎన్టీఆర్‌ జిల్లాలోని పలు ప్రాంతాలు.. ప్రధానంగా విజయవాడలోని కృష్ణలంక, అజిత్‌సింగ్‌ నగర్, భవానీపురం ప్రాంతాలకు చెందిన బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లు, కిరాయి రౌడీలు, రౌడీ షీటర్లను భారీగా టీడీపీ నేతల డైరెక్షన్‌లో ఇబ్రహీంపట్నం తరలించారు. వీరు  పెట్రోలు బాంబులు, బాటిళ్లతో దాడి చేసి, ఇంటికి ని­ప్పు పెట్టారు. ఇంట్లో సామగ్రి కాలి బూడిదైంది. ఇల్లంతా దట్టమైన పొగ కమ్ముకుంది. 

పెట్రోల్‌ బాంబులతో దాడి చేయడంతో తగలబడుతున్న జోగి రమేష్‌ ఇల్లు   

ఇదే సమయంలో భారీగా గుమికూడిన టీడీపీ మూకలు.. కత్తులు, కర్రలు, బండరాళ్లతో సైర్వ విహారం చేసి ఇంటిపైన రాళ్ల వర్షం కురిపించాయి. గేటును పగలగొట్టే యత్నం చేశారు. రాళ్ల దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోయాయి. ఈ దాడి సమయంలో జోగి రమేష్‌ తండ్రి జగన్‌­మోహన్‌రావు, కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. జోగి కుటుంబ సభ్యులను అంత మొందించాలనే కుట్రతో, పక్కా ప్రణాళికతో ఈ దాడి చేసినట్లు స్పష్టం అవుతోంది. కాగా, జోగి రమేష్‌ రాత్రి 11 గంటలకు ఆయన ఇంటికి వచ్చి టీడీపీ మూకలు దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు.

రోడ్డుపై బైఠాయింపు
జోగి రమేష్‌ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావును జూపూడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పరామర్శకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏమిటని దేవినేని అవినాష్‌ పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీ­సులు ఆయన్ను బలవంతంగా అరెస్టు చేసి, విజయవాడ భవానీపురం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 


విషయం తెలియడంతో అక్కడికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు చేరుకుంటుండంతో, ఆయన్ను అక్కడి నుంచి సత్యనారాయణపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. జోగి రమేష్‌ ఇంటిపై జరిగిన దాడిని ఎమ్మెల్సీ తలశిల రఘురాం, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ ఖండించారు. ఇలాంటి దాడులకు వైఎస్సార్‌సీపీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సత్యనారాయణపురం పోలీసు స్టేషన్‌ వద్దకు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్‌ భాగ్యలక్ష్మి, పార్టీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

పోలీసుల ప్రేక్షక పాత్ర
టీడీపీ గూండాలు జోగి రమేష్‌ ఇంటిపై దాడికి వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నామ మాత్రంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల కనుసన్నల్లోనే టీడీపీ, బ్లేడ్, గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు రెచ్చిపోయి దాడులు చేస్తున్నా చేష్టలుడిగి చూస్తు్తండిపోయారు. కనీసం వారిని నిలువరించ లేక, ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు. మధ్యాహ్నం నుంచే జోగి రమేష్‌ ఇంటి వైపు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులను నిలువరించిన పోలీసులు, టీడీపీ గూండాలకు మాత్రం పచ్చ జెండా ఊపారు. పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా మండిపడ్డారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement