
సాక్షి, హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో రాజధానిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. త్వరలో రెండు కీలక ఘట్టాలకు నగరం వేదిక కానుండటంతో హైదరాబాద్, సైబరాబాద్ అధికారులు అప్రమత్తమయ్యారు. సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు నగర వ్యాప్తంగా నిఘా కట్టుదిట్టం చేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని హెచ్ఐసీసీలో ఈ నెల 25, 26 తేదీల్లో భారత్ సమ్మిట్, వచ్చే నెల 7 నుంచి 31 వరకు మిస్ వరల్డ్–2025 పోటీలు జరగనున్నాయి. వీటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, సెలబ్రెటీలు రానున్నారు.
దేశంలోని ఉగ్రవాద ప్రభావిత నగరల్లో హైదరాబాద్ కూడా ఒకటి కావడంతో నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. భారత్ సమ్మిట్కు వంద దేశాల నుంచి దాదాపు 400 మంది, మిస్ వలర్డ్ పోటీలకు 140 దేశాల నుంచి కంటెస్టెంట్స్ హాజరుకానుండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ఈ రెండు కార్యక్రమాలూ సైబరాబాద్లో జరుగుతున్నప్పటికీ అతిథుల్లో అత్యధికులు హైదరాబాద్లోని వివిధ హోటళ్లలో బస చేయనున్నారు.