సాక్షి, ఢిల్లీ: పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ దాడిలో ప్రధాన నిందితుడిగా లష్కర్- ఇ- తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పేరును అధికారికంగా చేర్చింది. ఈ దాడిపై లోతైన విచారణ జరిపిన ఎన్ఐఏ ఎట్టకేలకు హఫీజ్ సయీద్ను నిందితుడిగా చేరుస్తూ అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
పహల్గామ్ దాడికి బాధ్యత వహిస్తూ 'TRF' అనే ఉగ్రవాద సంస్థ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఈ పోస్టులను దర్యాప్తు సంస్థ నిశితంగా పరిశీలించింది. ఈ సంస్థకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ జరిపింది. దీంతో TRF అనేది స్వతంత్ర సంస్థ కాదని కేవలం లష్కరే తోయిబా (LeT) కి చెందిన ముసుగు సంస్థ అని తేలింది.
అంతర్జాతీయ ఒత్తిడి, FATF ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి హఫీజ్ సయీద్ వ్యూహాత్మకంగా TRF పేరుతో దాడులు చేయిస్తున్నాడని ఎన్ఐఏ పక్కా ఆధారాలు సేకరించింది. దానితో పాటు పలు కోణాల్లో లోతైన విచారణ జరిపిన ఎన్ఐఏ అతని పేరును ఛార్జ్ షీట్ నమోదు చేసింది.
పహల్గామ్ అటాక్
2025, ఏప్రిల్ 22న మధ్యాహ్నం సమయంలో జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ బైసరన్ లోయలో జరిగిన ఈ ఉగ్రదాడి జరిగింది. పర్యాటకులపై పాకిస్థాన్ ఉగ్రమూకలు తుపాకులతో విరుచుకపడ్డాయి. దీంతో ఈ దాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అమానుష దాడిపై భారతావని భగ్గుమంది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోయింది.
ఆపరేషన్ సిందూర్
దీనికి కౌంటర్గా భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. పాక్లోని ప్రధాన ఉగ్రవాద సంస్థల స్థావరాలు ్ (LeT),జైషే మహమ్మద్ (JeM),హిజ్బుల్ ముజాహిదీన్ (HuM) పై ఎయిర్ స్ట్రైక్ చేసి వాటిని ధ్వంసం చేసింది. ఇక ఈ దాడిపై లోతైన విచారణ జరిపిన ఎన్ఐఏ లష్కరే-ఏ- తోయిబా చీఫ్ను ప్రధాన సూత్రధారిగా చేరూస్తూ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.


