న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో గల బైసారన్ వ్యాలీలో గత ఏడాది జరిగిన ఉగ్రదాడి దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దరిమిలా భారత సైన్యం చేతుల్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల వద్ద దొరికిన రెండు స్మార్ట్ఫోన్లను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయ. ఎన్ఐఏ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు జరిపిన దర్యాప్తులో, ఆ ఫోన్లు పాకిస్తాన్కు చెందిన ఒక ప్రముఖ బ్యాంకు ద్వారా అందినట్లు తేలింది. ఈ బ్యాంకు గతంలో కూడా లష్కర్ ఏ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు నిధులు మళ్లించినట్లు ఆరోపణలు ఎదుర్కొంది
బ్యాంకు చిరునామాలో ఉగ్రవాద ఫోన్లు
షావోమీ గ్లోబల్ అందించిన సమాచారం ప్రకారం, ఉగ్రవాదులు వాడిన ఫోన్లలో ఒకటి 2021లో పాకిస్తాన్కు చెందిన ‘టెక్ సిరాత్ ప్రైవేట్ లిమిటెడ్’ ద్వారా అందుకున్నారు. దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పాకిస్తాన్కు చెందిన ‘ఫైసల్ బ్యాంక్’ నిర్వహించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఫోన్ల డెలివరీ చిరునామా కరాచీలోని ఫైసల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయానిది. భారీ కన్సైన్మెంట్లకు బ్యాంకులు లెటర్ ఆఫ్ క్రెడిట్ అందించడం సాధారణమే అయినప్పటికీ, ఆ కన్సైన్మెంట్ నుండి ఈ ఫోన్ అక్రమంగా బయటకు వచ్చి, ఉగ్రవాదుల చేతికి చిక్కడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
ఆన్ చేయని ఫోన్లు.. భారీ కుట్ర
ఈ ఫోన్ల దర్యాప్తులో మరో సంచలన విషయం బయటపడింది. ఇవి 2021, 2023లో పాకిస్తాన్కు చేరినప్పటికీ, పహల్గామ్ దాడికి కొద్ది రోజుల ముందు వరకు ఎప్పుడూ వీటిని ఆన్ చేయలేదు. ఉగ్రవాదులను ప్రత్యేకంగా లక్ష్యిత దాడుల కోసం వీటిని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఉగ్రవాదులు సాధారణ నెట్వర్క్లను కాకుండా, సుదూర ప్రాంతాల్లో సురక్షితంగా సమాచారం పంచుకోవడానికి రేడియో కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించినట్లు గుర్తించారు. దాడికి వారం రోజుల ముందే ఉగ్రవాదులు ఏర్పాటు చేసుకున్న టెంట్ ఫోటోలు, మ్యాప్లు ఈ ఫోన్లలో లభ్యమయ్యాయి. ఇది వారి ముందస్తు ప్రణాళికను తెలియజేస్తోంది.


