హైదరాబాద్: రాజమండ్రిలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కర్నూలుకు చెందిన ప్రియాంక తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది.
ఈ నెల 3న రాజమండ్రిలో తోటి విద్యార్థినితో కలిసి సినిమా థియేటర్ నుంచి వస్తుండగా మద్యం మత్తులో ఉన్న దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్లు కారును వేగంగా నడుపుతూ వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. మరోసారి బలంగా ఢీకొట్టి ప్రియాంక మీద నుంచి కారు వెళ్లడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, గ్లాస్గో కోమా స్కేల్ (జీసీఎస్) తక్కువగా ఉండటంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు.
వారిని వదిలిపెట్టరాదు
కొద్ది రోజుల్లో వైద్య విద్య పూర్తి చేసుకుని వైద్యురాలిగా సేవలు అందిస్తుందని అనుకున్నాం. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండి అన్నీ చూసుకోవాలని అనుకునేది. కానీ ఆమెను ఈ పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందనుకోలేదు. మా కుమార్తె బతకాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఆప్నియా టెస్టుకు ఆమె శరీరం సహకరించడం లేదు అందుకే వైద్యులు విరమించుకున్నారు. మా కుమార్తెకు ఈ గతి పట్టించిన వాళ్లను వదలిపెట్టకూడదు. నడిరోడ్డులో ఉరితీయాలి.
– తండ్రి వెంకటేష్


