హాజరు వేసుకుంటున్న విద్యార్థి
నంగునూరు (సిద్దిపేట): తమ అటెండెన్స్ తామే వేసుకుంటూ మురిసిపోతున్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని మగ్ధూంపూర్ పాఠశాల విద్యార్థులు. హాజరు శాతం పెంచేందుకు ఉపాధ్యాయుడు చేసిన వినూత్న ప్రయోగం సత్ఫలితాలు ఇవ్వడంతో హెచ్ఎంతోపాటు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ఆకట్టుకునేందుకు ఉపాధ్యాయుడు ముస్లీ రాజయ్య నోటీస్ బోర్డుపై అగ్గిపెట్టెతో కూడిన సెల్ఫ్ అటెండెన్స్ బోర్డును ఏర్పాటు చేశారు.
విద్యార్థి పాఠశాలకు రాగానే అగ్గిపెట్టెను తెరిచి తన ఫొటో కనబడేలా ఉంచి హాజరు వేసుకుంటాడు. బడి సమయం ముగియగానే అగ్గిపెట్టెను మూసివేసి ఇంటికి వెళ్తారు. ఒకవేళ విద్యార్థి మర్నాడు రాకుంటే ఆబ్సెంట్ కనబడుతుంది. దీంతో బడికి రాలేదని తెలిసిపోతుందని విద్యార్థులు రోజూ వస్తున్నారు. ఈ ప్రయోగం సత్ఫలితాలివ్వడంతో మిగతా తరగతులకు సెల్ఫ్ అటెండెన్స్ బోర్డులను ఏర్పాటు చేశారు.


