వైద్య విద్యార్థిని ప్రియాంకను మూడుసార్లు కారుతో ఢీకొట్టిన యువకులు
సీసీ టీవీ ఫుటేజీలో నిర్ధారణ
హత్యాయత్నం కేసుగా నమోదు చేయాలని స్థానికుల డిమాండ్
విషమంగా ప్రియాంక ఆరోగ్య పరిస్థితి
ఇది మద్యం మత్తులో జరిగిన ప్రమాదమేనంటున్న పోలీసులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/ సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక ప్రమాద ఘటనకు సంబంధించి లభ్యమైన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే ఇది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసినదేనని స్పష్టమవుతోంది. ప్రమాదానికి కారణమైన యువకులు సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసెఫ్ ఈ నెల మూడో తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న ప్రసాద్ ఆదిత్యమాల్కు సినిమా చూసేందుకు కారులో వచ్చారు. వారు మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానించిన మాల్ సిబ్బంది బ్రీత్ ఎనలైజర్తో పరిశీలించగా, ఆ యువకులు వారిపై దురుసుగా ప్రవర్తించారు.
మద్యం తాగినట్టు నిర్ధారణ కావడంతో వారిని థియేటర్ లోపలికి అనుమతించలేదు. దీంతో ఆ యువకులు బయటకు వెళ్లే క్రమంలో నియంత్రణ లేకుండా కారును నడిపినట్టు సీసీ టీవీ ఫుటేజీల్లో నిర్ధారణ అయ్యింది. వారి కారు ఆదిత్య మాల్ గేటు దాటుతున్న సమయంలోనే... వైద్య విద్యార్థిని ప్రియాంక, ఆమె స్నేహితుడు మల్లి వెంకటదుర్గసాయి కూడా బైక్పై మాల్ గేటు దాటుతున్నారు. ఈ క్రమంలో యువకుల కారు వారి బైక్ని ఢీకొట్టింది. ప్రియాంక వారి వైపు కోపంగా చూడటంతో మరోసారి కారుతో వారి బైక్ను ఢీకొట్టారు. అలా మూడుసార్లు వెంటవెంటనే బైక్ని ఢీకొట్టారు. దీంతో బైక్ పైనుంచి ప్రియాంక కింద పడిపోయింది.
ఇది చూసిన మాల్ సిబ్బంది కేకలు వేయడంతో యువకులు కారును వేగంగా దూసుకువెళ్లారు. ఈ క్రమంలో కిందపడిన ప్రియాంక తల పైనుంచి కారు ఎక్కి వెళ్లడం సీసీ టీవీ ఫుటేజీలో కనిపించింది. ప్రియాంకను ఆమె స్నేహితుడు, థియేటర్ సిబ్బంది హుటాహుటిన కంబాలచెరువులోని స్వతంత్ర ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి అత్యంత విషమించడంతో అక్కడి నుంచి ఆమెను హైదరాబాద్కు తరలించారు. అక్కడి కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయిందని, మృత్యువుతో పోరాడుతోందని వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది.
విచారణ చేపట్టాలి: రాజమహేంద్రవరం వైద్య విద్యారి్థని ప్రియాంక ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీ జుడా) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనపై సమగ్ర, పారదర్శక, నిష్పాక్షిక విచారణ జరిపించాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.
సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా యువకుల గుర్తింపు
ప్రమాద ఘటనపై థియేటర్ మేనేజర్ విజయ్ ఫిర్యాదు మేరకు ఒక కేసు, ప్రియాంక తండ్రి కనికే వెంకటేష్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదయ్యాయి. సీసీ టీవీ ఫుటేజీల్లో నమోదైన కారు నంబర్ ఆధారంగా యువకులను పోలీసులు గుర్తించారు. వారిద్దరూ చింతల నామవరానికి చెందినవారుగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయినా ప్రకాశ్నగర్ పోలీసులు మాత్రం ఇది మద్యం మత్తులో జరిగిన ప్రమాదమేనని, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని హడావిడిగా ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది.


