
ఆభరణాల విలువే రూ. 25 కోట్లకు పైగా ఉంటుందని అంచనా
ముగిసిన నాలుగో రోజు కస్టడీ.. ఆయన బంధువుల్లో కొందరికి త్వరలో నోటీసులు!
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఇరిగేషన్ ఈఈ నూనె శ్రీధర్ అక్రమాస్తులు చూసి ఏసీబీ అధికారులే నివ్వెరబోతున్నారు. సోమవారం నాలుగో రోజు కస్టడీలో భాగంగా నూనె శ్రీధర్ను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఏసీబీ అధికారులు కీలక వివరాలు సేకరించారు. మొదటి మూడు రోజులు సహకరించనప్పటికీ సోమవారం పలు ఆస్తుల పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు ముందుంచి ప్రశ్నించడంతో శ్రీధర్ నోరువిప్పినట్లు తెలిసింది.
మరోవైపు ఆయనకు చెందిన బ్యాంకు లాకర్లను తెరిపించగా వాటిలో భారీగా బంగారు ఆభరణాలు, ఆస్తుల పత్రాలు, నగదును ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. అనధికారిక సమాచారం ప్రకారం లాకర్లలో లభ్యమైన బంగారు ఆభరణాల విలువే రూ. 25 కోట్లకుపైగా ఉంటుందని తెలిసింది. అయితే అందులోని ఆస్తుల వివరాలు ఏమిటో తెలియరాలేదు. కోర్టు ఆదేశం ప్రకారం మంగళవారంతో శ్రీధర్ ఏసీబీ కస్టడీ ముగియనుంది. మరోవైపు ఇప్పటివరకు సేకరించిన వివరాల ఆధారంగా శ్రీధర్ కుటుంబ సభ్యులు, బంధువుల్లో కొందరికి ఏసీబీ త్వరలో నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.