మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఆర్వీ కర్ణన్, చిత్రంలో కలెక్టర్ ప్రియాంక
వీలైనంత మేర ఆఫ్లైన్లో సమర్పించండి
ప్రజల్లో అవగాహన కోసం మరిన్ని ప్రచార కార్యక్రమాలు
‘సర్’ ప్రక్రియపై జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)కు సంబంధించి హైదరాబాద్ జిల్లాలో నూరు శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఇందులో దాదాపు 24 శాతం మంది ఆచూకీ లేని, చిరునామా మారిన, మరణించిన వారున్నారని..మరణించిన వారు మినహా మిగతా వారు గత ఎన్నికల్లో తమ పోలింగ్బూత్ బీఎల్ఓను సంప్రదించి ఫారాలు పొందవచ్చునన్నారు. భర్తీ చేసిన ఫారాలను పరిశీలించి, డిజిటలీకరణ చేయాల్సి ఉన్నందున చివరి రోజు వరకు వేచి ఉండకుండా వెంటనే బీఎల్ఓలకు అందజేయాలన్నారు. ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో అందజేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా సూచించారు. జిల్లా కలెక్టర్, డిప్యూటీ ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక, జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అడిషనల్ కమిషనర్ బి.సంతో‹Ùలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. అందిన ఫారాలలో దాదాపు 26 శాతం డిజిటలైజేషన్ జరిగిందన్నారు.
విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు
ప్రజలను చైతన్యం చేసేందుకు యూట్యూబ్ వీడియోలతో సహ సోషల్ మీడియా, ప్రింట్ ఎల్రక్టానిక్ మీడియా, పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగులు, ఆస్తిపన్ను చెల్లింపుదారులకు మెసేజ్లు, రాజకీయపార్టీలు, బూత్స్థాయి ఏజెంట్లు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లతో సమావేశాలు, తదితరమైనవి నిర్వహిస్తున్నామన్నారు. ఫారాలు ఎలా భర్తీచేయాలో తెలియజేస్తున్నామన్నారు. ఇంకా ఫారాలందని వారుంటే సంబంధిత బీఎల్ఓను, సూపర్వైజర్ను కానీ సంప్రదించాలని, లేదా 1950 నెంబర్కు కాల్చేయాలని సూచించారు. గడువు తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఫారాలు తీసుకోరని స్పష్టం చేశారు.
ఫారాలివ్వడం ఓటరు బాధ్యత
2002 వివరాలు లేనివారు, ప్రస్తుత వివరాలతోనే ఫారం నింపి ఇవ్వాలని సూచించారు. ఫారాలివ్వడం ఓటరు బాధ్యత అని స్పష్టం చేశారు. స్పెల్లింగ్ పొరపాట్లు వంటివి ఉన్నా, ప్రస్తుతానికి ఓటరు జాబితాలో ఉన్నవిధంగా భర్తీచేయాలని, పొరపాట్లు తర్వాత సరిచేసుకోవచ్చని తెలిపారు. కంటోన్మెంట్లోని కొన్ని పీఎస్లకు సంబంధించిన 2002 జాబితాలు లేనివారికోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. 3.73 లక్షల మంది (7.8 శాతం) ఆన్లైన్ ద్వారా వివరాలు సమర్పించారని తెలిపారు. డిజిటలైజేషన్ అయితేనే ముసాయిదాలో పేరుంటుందని, సమస్యలున్న వారికి నోటీసు అందుతుందని, తగిన వివరాలు సమరి్పస్తే జాబితాలో చేర్చుతారని చెప్పారు.


