
ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో టీమిండియా విజయావకాశాలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. నాలుగో రోజు తొలి సెషన్ సమయానికి ఆసీస్ 333 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుండటంతో టీమిండియా డ్రా కోసమే ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే డ్రా లేక ఓటమే తప్ప.. రోహిత్ సేనకు గెలిచే అవకాశం దాదాపుగా లేనట్టే.
ఈ పరిస్థితుల్లో మరో విషయం టీమిండియాను తెగ కలవరపెడుతుంది. ఓవల్లో ఇప్పటివరకు ఏ జట్టు 300కు పైగా టార్గెట్ను ఛేదించింది లేదు. ఇక్కడ విజయవంతంగా ఛేదించిన టార్గెట్ 263. 1902లో ఆస్ట్రేలియా నిర్ధేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ అతికష్టం మీద 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆతర్వాత 1963లో 255, 1972లో 242, 1988లో 226 పరుగుల లక్ష్యాలను వివిధ జట్లు ఛేదించాయి. ఎటు చూసినా ఓవల్లో 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం మాత్రం చాలా కష్టం. ఈ విషయమే ప్రస్తుతం టీమిండియాను కలవరపెడుతుంది.
ఇదిలా ఉంటే, 123/4 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. ఆదిలోనే లబూషేన్ వికెట్ కోల్పోయింది. మూడో ఓవర్లోనే లబూషేన్ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్కు పంపించాడు. వికెట్ కోల్పోయినా ఆసీస్ ఏమాత్రం తడబడకుండా నిలకడగా ఆడుతుంది. ఆ జట్టు స్కోర్ 160/5గా ఉంది. గ్రీన్ (21), క్యారీ (19) క్రీజ్లో ఉన్నారు.
స్కోర్ వివరాలు..
- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469 ఆలౌట్ (హెడ్ 163, స్మిత్ 121, సిరాజ్ 4/108)
- భారత్ తొలి ఇన్నింగ్స్: 296 ఆలౌట్ (రహానే 89, ఠాకూర్ 51, కమిన్స్ 3/83)
- ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 160/5 (లబూషేన్ 41, జడేజా 2/32)
ఆసీస్ 311 పరుగుల ఆధిక్యంలో ఉంది
చదవండి: WTC Final: అరుదైన క్లబ్లో మిచెల్ స్టార్క్.. నాలుగో బౌలర్గా..!