ఫిఫా ప్రపంచకప్ 2026 సమయంలో అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలకు హత్యా బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీని లక్ష్యంగా చేసుకుని ఆటగాళ్లు, రెఫరీలపై బాంబు బెదిరింపులు, ఆన్లైన్ వేధింపులు, స్టాకింగ్ వంటి సంఘటనలు జరిగినట్లు ఒక స్పానిష్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది.
ఈ బెదిరింపులు ఎదుర్కొన్న వారిలో అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీనే ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు సదరు నివేదిక పేర్కొంది. అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI), ఇంటర్నేషనల్ పోలీస్ కోఆపరేషన్ (IPCC) సంయుక్తంగా ఈ భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించి దర్యాప్తు జరిపినట్లు సమాచారం.
ఏమి జరిగిదంటే?
ఈ మెగా ఈవెంట్లలో భాగంగా జూన్ 28న డల్లాస్ వేదికగా అర్జెంటీనా - జోర్డాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్కు ముందు ఒక వ్యక్తి డల్లాస్ ఎయిర్పోర్ట్కు ఫోన్ చేసి, తనతో పాటు మరొక ఇద్దరు నాటు బాంబులు, తుపాకీతో స్టేడియంకు వస్తున్నామని బెదిరించాడు. మైదానంలోని పోలీసులు, ఆటగాళ్లతో పాటు ముఖ్యంగా లియోనెల్ మెస్సీని అంతం చేయడమే తమ లక్ష్యమని హెచ్చరించాడు.
అంతేకాకుండా జూలై 7న అర్జెంటీనా - ఈజిప్ట్ మ్యాచ్కు ముందు మరో వ్యక్తి ఎక్స్ వేదికగా బెదరింపులకు దిగాడు. "నా ఒంటికి నాలుగు బాంబులు కట్టుకుని మెస్సీని పేల్చేస్తాను" ఎక్స్లో పోస్ట్ చేశాడు.
అదే సమయంలో మరొక వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి స్టేడియంలోని మూడు డస్ట్బిన్లలో బాంబులు అమర్చినట్లు చెప్పాడు. దీంతో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ రంగంలోకి దిగి తీవ్ర తనిఖీలు చేపట్టాయి. కానీ ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా బాంబులు దొరకకపోవడంతో ఆ బెదిరింపులు అన్నీ బూటకమని తేలాయి
మరోవైపు పోర్చుగల్ స్టార్ రొనాల్డోను కూడా టార్గెట్ చేశారు. రొనాల్డో బస చేసిన హోటల్ సమాచారం సేకరించిన వ్యక్తిని హ్యూస్టన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా అర్జెంటీనా-ఈజిప్ట్ మ్యాచ్ తర్వాత ఫ్రెంచ్ రెఫరీ ఫ్రాంకోయిస్ లెటెక్సియర్కు వాట్సాప్లో ఏకంగా 6,000కు పైగా బెదిరింపు మెసేజ్లు వచ్చాయి.
చదవండి: బంగ్లాదేశ్కు తిరిగొస్తా.. కానీ వన్ కండీషన్: షకీబ్


