బంగ్లాదేశ్ క్రికెట్ దిగ్గజం, మాజీ ఎంపీ షకీబ్ అల్ హసన్ స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ప్రభుత్వం తన భద్రతకు పూర్తి హామీ ఇస్తే బంగ్లాకు తిరిగి వస్తానని షకీబ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అదేవిధంగా తనపై ఉన్న హత్య కేసులతో సహా అన్ని అభియోగాలపై విచారణను ఎదుర్కోవడానికి తాను సిద్దంగా ఉన్నానని అతడు స్పష్టం చేశాడు.
కాగా బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ తరఫున షకీబ్ ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. 2024లో హసీనా ప్రభుత్వం రద్దు అయిన నేపథ్యంలో అతడి పదవి కూడా పోయింది. అంతేకాకుండా అతడిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు.
అప్పటి నుంచి షకీబ్ దేశం విడిచి కుటంబంతో కలిసి అమెరికాలో నివసిస్తున్నాడు. అయితే ఇటీవలషేక్ హసీనా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో షకీబ్ వర్చువల్గా పాల్గొన్నాడు. దీంతో బంగ్లాలోని అతడి ఇంటిపై దుండగులు పెట్రోల్ బాంబులు బీభత్సం సృష్టించారు. ఈ నేపథ్యంలో అతడు తిరిగి బంగ్లాకు వస్తానని ప్రకటించడం గమనార్హం.
ప్రభుత్వం నాకు తగిన భద్రత కల్పిస్తే బంగ్లాదేశ్కు తిరిగి వచ్చి కోర్టు విచారణను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నాను. నేను ఎలాంటి తప్పూ చేయలేదు. నాపై మోపిన ఆరోపణలన్నీ అబద్ధాలే. మా కెప్టెన్ (షేక్ హసీనా) ఏది చెబితే అది వింటాం. ఆమె దీనిపై సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను.
నేను ప్రస్తుతం చాలా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో ఆడుతున్నాను. ఆటను ఆస్వాదిస్తున్నాను. కానీ వయసు అవుతున్న కొద్దీ ఆటలో కొనసాగేందుకు కాస్త ఇబ్బందిగా ఉంది. కాబట్టి నేను ఎక్కువ కాలం కొనసాగలేను అనుకుంటున్నా.
అందుకే బంగ్లాకు వచ్చి ఫేర్వేల్ సిరీస్ ఆడి రిటైర్ అవ్వాలని ఉంది" అని రాయిటర్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షకీబ్ పేర్కొన్నాడు. కాగా మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్లో బంగ్లాదేశ్ తిరిగి రావడానికి సిద్దమవుతున్నారు. ఆమెతో పాటు షకీబ్ కూడా బంగ్లాకు వెళ్లే అవకాశముంది.


