Photo Credit: BCCI Twitter
భారత జట్టులో అవకాశాలు రాకపోవడంతో వెటరన్ క్రికెటర్ జైదేవ్ ఉనాద్కట్ కౌంటీ క్రికెట్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ససెక్స్ తరఫున కౌంటీ చాంపియన్షిప్లో పాల్గొనేందుకు జైదేవ్ ఉనాద్కట్ ఈ వారం చివర్లో ఇంగ్లండ్కు బయల్దేరి వెళ్లనున్నాడు. ప్రస్తుతం హండ్రెడ్ టోర్నీతో పాటు వన్డే కప్ జరుగుతుండడంతో కౌంటీ క్రికెట్కు చిన్న బ్రేక్ వచ్చింది.
కౌంటీ క్రికెట్ ప్రారంభమవ్వగానే ఉనాద్కట్ జట్టుతో జాయిన్ అవనున్నాడు. ఓలీ రాబిన్సన్ నేతృత్వంలోని ససెక్స్ జట్టు ఈ సీజన్లో మంచి ప్రదర్శనే చేసింది. ఆడిన 8 మ్యాచ్ల్లో నాలుగు విజయాలు, రెండు ఓటములు, రెండు డ్రాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆగస్టు 20న తిరిగి ప్రారంభం కానున్న కౌంటీ చాంపియన్షిప్లో ఉనాద్కట్ ససెక్స్ తరఫున వార్విక్షైర్తో బర్మింగ్హమ్ వేదికగా మ్యాచ్లో ఆడనున్నాడు.
కాగా ఉనాద్కట్ 2023 నుంచే కౌంటీల్లో ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాడు. మొత్తం ఇప్పటివరకు ససెక్స్ తరఫున 13 మ్యాచ్లాడిన ఉనాద్కట్ 57 వికెట్లు పడగొట్టాడు. ఇక టీమిండియా తరఫున ఉనాద్కట్ నాలుగు టెస్టులు, ఎనిమిది వన్డేలు, 10 టీ20 మ్యాచ్లు ఆడాడు.
ఇక ఉనాద్కట్ చివరగా ఆగస్టు 2023లో వెస్టిండీస్తో వన్డే మ్యాచ్ ఆడాడు. అదే ఏడాది పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తోనే చివరి టెస్టు ఆడాడు. ఇక ఉనాద్కట్ చివరి టీ20 మ్యాచ్ ఆడి 8 సంవత్సరాలు దాటింది. ఇక జైదేవ్ ఉనాద్కట్తో పాటు ప్రస్తుతం చాహల్ నాటింగ్హమ్షైర్కు, సర్రీ తరఫున రాహుల్ చాహర్ ఆడుతున్నారు. ఇక యార్క్షైర్ తరఫున కుల్దీప్ యాదవ్ వన్డే కప్ ఆడుతుండగా, స్నిన్నర్ మానవ్ సుతార్ వార్విక్షైర్ తరఫున రెండు కౌంటీ మ్యాచ్లు ఆడాడు.
చదవండి: ‘వైభవ్ వాటికి దూరంగా ఉండు.. లేదంటే మరో పృథ్వీ షానే!’


