వైభవ్, తిలక్‌ మెరుపులు.. శ్రీలంక-ఏ టార్గెట్‌ 378 రన్స్‌ | Vaibhav-Tilak Varma Fifties-Guides India-A-Big Score Vs SL-A Final Match | Sakshi
Sakshi News home page

వైభవ్, తిలక్‌ మెరుపులు.. శ్రీలంక-ఏ టార్గెట్‌ 378 రన్స్‌

Jun 21 2026 1:50 PM | Updated on Jun 21 2026 3:31 PM

Vaibhav-Tilak Varma Fifties-Guides India-A-Big Score Vs SL-A Final Match

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న ఫైనల్  మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (29 బంతుల్లో 94 పరుగులు, 10 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 

కెప్టెన్ తిలక్ వర్మ (90 బంతుల్లో 67, 4 ఫోర్లు, 1 సిక్సర్‌) క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మిగిలిన బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ (40), ప్రియాన్ష్ ఆర్య (39) రాణించారు. ఆఖర్లో విప్రజ్ నిగమ్ (27), అనుకుల్‌ రాయ్‌ (15 బంతుల్లో 39, 1 ఫోర్‌, 4 సిక్స‌ర్లు) ధాటిగా ఆడ‌డంతో ఇండియా-ఏ స్కోరు 370 ప‌రుగుల మార్క్‌ను దాటింది. లంక బౌలర్లలో రవిందు ఫెర్నాండో, వనుజా సాహన్చె, కుగతా మథులన్ 2 వికెట్లు తీయగా, మొహమ్మద్ షిరాజ్‌, సహన్ అరాచిగే, దులజ్ సముదితా తలా ఒక​ వికెట్ పడగొట్టారు.

వైభవ్ జోరు.. లంక బేజారు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏ జట్టుకు వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఆరంభం నుంచే లంక బౌలర్లను ఉతికారేసిన సూర్యవంశీ 11 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించి ప్ర‌పంచ రికార్డు సాధించాడు. ఆ త‌ర‌వ్ఆత కూడా త‌న విధ్వంసాన్ని కొన‌సాగించిన వైభ‌వ్ 29 బంతుల్లో 94 ప‌రుగుల వ‌ద్ద ఔటవ్వడంతో అత‌డి జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. వైభ‌వ్ దెబ్బ‌కు 8.5 ఓవ‌ర్ల‌లో 132 ప‌రుగులు రాగా.. 

అందులో వైభ‌వ్ సూర్య‌వంశీవే 94 ప‌రుగులు ఉండ‌డం గ‌మ‌నార్హం. సూర్య‌వంశీ ఔటైన త‌ర్వాత ప్రియాన్ష్ ఆర్య కూడా వెనుదిరిగాడు. ఈ ద‌శ‌లో రుతురాజ్‌కు జ‌త క‌లిసిన తిల‌క్ వ‌ర్మ కాస్త నిధానంగా ఆడ‌డంతో ప‌రుగులు రావ‌డం మంద‌గించింది. ఈ ఇద్ద‌రు మూడో వికెట్‌కు 84 ప‌రుగులు జోడించారు. అనంత‌రం 220 ప‌రుగుల వ‌ద్ద రుతురాజ్ వెనుదిరిగాడు. 

ఆ త‌ర్వాత వ‌చ్చిన కుమార్ కుషాగ్ర కూడా ప‌ర్వాలేద‌నిపించడంతో స్కోరు న‌త్త‌న‌డ‌క‌నే సాగింది. ఈ ద‌శ‌లో హాఫ్ సెంచ‌రీ చేసిన తిల‌క్ వ‌ర్మ 67 ప‌రుగుల వ‌ద్ద ఔటవ్వ‌డంతో ఇండియా-ఏ ఐదో వికెట్ కోల్పోయింది. తిల‌క్ ఔటైన త‌ర్వాత ఇండియా-ఏకు ప‌రుగులు రాలేదు. వైభ‌వ్ విధ్వంసంతో 400 ప‌రుగులు ఈజీగా వ‌స్తాయ‌నిపించింది. అయితే చివ‌ర్లో విప్రజ్, అనుకుల్ రాయ్ మెరుపుల‌తో ఇండియా-ఏ 370 పరుగుల మార్క్‌ను దాటింది.

 

చదవండి: కవ్వించి తప్పు చేశారు.. వైభవ్ ప్రతీకారం!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement