ఇవాళ ముగిసిన లార్డ్స్ టెస్ట్లో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ 115 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత WTC 2025-27 పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఓటమితో న్యూజిలాండ్ రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది.
మరోవైపు న్యూజిలాండ్పై గెలిచినా ఇంగ్లండ్ స్థానంలో ఎలాంటి మార్పు జరగలేదు. వారి PCT (పాయింట్ల శాతం) 31.67 నుంచి 37.88కి పెరిగినప్పటికీ ఏడో స్థానంలోనే కొనసాగుతోంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ నాలుగో స్థానానికి పడిపోవడంతో సౌతాఫ్రికా, శ్రీలంక రెండు, మూడు స్థానాలకు ఎగబాకాయి.
భారత్ ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఇటీవల పాక్ను రెండు మ్యాచ్ సిరీస్లో క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్ ఐదో స్థానంలో ఉంది. వెస్టిండీస్ (9), పాకిస్తాన్ (8) జట్లు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.
లార్డ్స్ టెస్ట్ విషయానికొస్తే.. పేసర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ నిర్దేశించిన 254 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ పూర్తిగా చేతులెత్తేసింది. 138 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్లో 0-1తో వెనుకపడిపోయింది.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ల్లో ఇరు జట్లు స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యాయి. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ ఇంగ్లండ్ను 140 పరుగులకే ఆలౌట్ చేసింది. జేమీసన్ 5, నాథన్ స్మిత్ 3, విలియమ్ ఓరూర్కీ 2 వికెట్లతో సత్తా చాటారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ (56) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.
అనంతరం న్యూజిలాండ్ మరింత చెత్తగా ఆడి 113 పరుగులకే కుప్పకూలింది. రాబిన్సన్ 5, టంగ్ 3, అట్కిన్సన్ 2 వికెట్లతో చెలరేగారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో 38 పరుగులు చేసిన జేమీసన్ టాప్ స్కోరర్గా నిలిచాడు.
27 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ అరంగేట్రం బ్యాటర్ ఎమిలియో గే (57), డకెట్ (33), జేమీ స్మిత్ (39) రాణించడంతో 226 పరుగులు చేయగలిగింది. నాథన్ స్మిత్ 6 వికెట్లతో విజృంభించగా.. విలియమ్ ఓరూర్కీ 2, మ్యాట్ హెన్రీ, జేమీసన్ తలో వికెట్ తీశారు.
254 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ మరోసారి బొక్కబోర్లా పడింది. అట్కిన్సన్ 5, రాబిన్సన్, టంగ్ తలో 2, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టడంతో 138 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో కాన్వే (41), గ్లెన్ ఫిలిప్స్ (44 నాటౌట్), కేన్ విలియమ్సన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ సిరీస్లోని రెండో టెస్ట్ కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జూన్ 17న మొదలవుతోంది.


