భారత్‌ గురికి రెండు కాంస్యాలు | Two bronzes for India | Sakshi
Sakshi News home page

భారత్‌ గురికి రెండు కాంస్యాలు

Aug 18 2023 2:36 AM | Updated on Aug 18 2023 7:07 AM

Two bronzes for India - Sakshi

పారిస్‌: ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–4 టోర్నీలో రెండో రోజూ భారత్‌ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. తొలి రోజు బుధవారం కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్‌ చేరి కనీసం రెండు రజతాలు ఖరారు చేసుకోగా... గురువారం రికర్వ్‌ టీమ్‌ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాయి.  

ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్‌తోపాటు అతాను దాస్, తుషార్‌ ప్రభాకర్‌ షెలే్కలతో కూడిన భారత పురుషుల జట్టు కాంస్య పతక మ్యాచ్‌లో 6–2తో (54–56, 57–55, 56–54, 57–55) స్పెయిన్‌ జట్టుపై గెలుపొందింది. సెమీఫైనల్లో భారత్‌ 0–6తో (54–56, 47–58, 55–56) చైనీస్‌ తైపీ జట్టు చేతిలో ఓడిపోయి కాంస్య పతకం కోసం పోటీపడింది.

రికర్వ్‌ ఈవెంట్‌లో మ్యాచ్‌లను ‘బెస్ట్‌ ఆఫ్‌ ఫోర్‌ సెట్స్‌’ పద్ధతిలో మ్యాచ్‌ను నిర్వహిస్తారు. సెట్‌ గెలిచిన జట్టుకు రెండు పాయింట్లు లభిస్తాయి. స్కోరు సమంగా నిలిస్తే రెండు జట్లకు ఒక్కో పాయింట్‌ వస్తుంది. నాలుగు సెట్‌ల తర్వాత స్కోరు సమమైతే ‘షూట్‌ ఆఫ్‌’ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.  

మహిళల టీమ్‌ రికర్వ్‌ కాంస్య పతక మ్యాచ్‌లో అంకిత, భజన్‌ కౌర్, సిమ్రన్‌జిత్‌ కౌర్‌లతో కూడిన భారత జట్టు ‘షూట్‌ ఆఫ్‌’లో 5–4తో (52–55, 52–53, 55–52, 54–52, 27–25) మెక్సికో జట్టును ఓడించింది. నాలుగు సెట్‌ల తర్వాత రెండు జట్లు 4–4తో సమంగా నిలిచాయి.

విజేతను నిర్ణయించేందుకు ‘షూట్‌ ఆఫ్‌’ నిర్ణయించగా... భారత బృందం 27 పాయింట్లు స్కోరు చేయగా... మెక్సికో జట్టు 25 పాయింట్లు చేసి ఓడిపోయింది. అంతకుముందు సెమీఫైనల్లో భారత్‌ 0–6తో (52–57, 47–56, 52–53) చైనీస్‌ తైపీ జట్టు చేతిలో ఓడిపోయి కాంస్య పతకం కోసం ఆడింది.  

సెమీఫైనల్లో జ్యోతి సురేఖ 
మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ స్టార్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి పతకం రేసులో నిలిచింది. సురేఖ తొలి రౌండ్‌లో 145–131తో పూన్‌ చియు యి (హాంకాంగ్‌)పై, రెండో రౌండ్‌లో 148–145తో చెన్‌ లి జు (చైనీస్‌ తైపీ)పై, మూడో రౌండ్‌లో 148–145తో హువాంగ్‌ జు (చైనీస్‌ తైపీ)పై, క్వార్టర్‌ ఫైనల్లో 147–144తో డాఫ్నీ క్వింటెరో (మెక్సికో)పై నెగ్గింది.

శనివారం జరిగే సెమీఫైనల్లో ఎల్లా గిబ్సన్‌ (బ్రిటన్‌)తో సురేఖ ఆడుతుంది. ప్రపంచ చాంపియన్, భారత ప్లేయర్‌ అదితి క్వార్టర్‌ ఫైనల్లో 135–148తో ఎల్లా గిబ్సన్‌ చేతిలో ఓడింది. 

Advertisement
 
Advertisement
Advertisement