టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగియనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో హైదరాబాదీ, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ను కొత్త చీఫ్ సెలెక్టర్గా నియమించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి అగార్కర్ కాంట్రాక్ట్ 2026 జూన్తో ముగియాల్సి ఉంది. కానీ భారత క్రికెట్ బోర్డు అతడికి మూడు నెలల ఎక్స్టెన్షన్ ఇచ్చింది. అంతేకాకుండా వన్డే ప్రపంచకప్-2027 వరకు అతడినే కొనసాగించాలని బోర్డు పెద్దలు భావించినప్పటికి.. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై అగార్కర్ అండ్ కో, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇంగ్లండ్ జరిగిన మూడు వన్డేల సిరీసే రోహిత్కు ఆఖరిదని, తదుపరి సిరీస్లకు అతడిని పక్కన పెట్టాలని సెలెక్టర్లు భావించినట్లు ప్రచారం జరిగింది.
ఇదే విషయంపై అజిత్,గంభీర్లు బీసీసీఐ పెద్దలతో చర్చించినట్లు వార్తలు వచ్చాయి. కానీ బీసీసీఐ మాత్రం అందుకు విముఖత చూపినట్లు పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందిస్తూ.. రోహిత్ శర్మ భారత జట్టులో కీలక సభ్యుడని, లార్డ్స్ వన్డే అతడికి ఆఖరిది కాదని స్పష్టం చేశాడు.
అయితే ఆఖరి మ్యాచ్ అని ప్రచారం జరిగిన లార్డ్స్ వన్డేలో హిట్మ్యాన్ అద్భుత సెంచరీతో చెలరేగి తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. తన ఆటతోనే సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్కు రోహిత్ సమాధనమిచ్చాడు. మరోవైపు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఘోరంగా ఓడిపోవడంపై కోచ్, కెప్టెన్, చీఫ్ సెలక్టర్తో బీసీసీఐ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని భావించింది.
కానీ ఈ సమీక్ష జరగకుండానే జట్టు శ్రీలంక టెస్టు సిరీస్కు వెళ్లిపోవడంపై బోర్డు తీవ్ర అసంతృప్తితో ఉంది. వరుస వివాదాలు, ప్లానింగ్ లోపాల కారణంగా అగార్కర్ స్థానంలో లక్ష్మణ్ను తీసుకురావడమే బెటర్ అని బీసీసీఐ భావిస్తుందంట.


