PC: BCCI X
గతంలో ఎన్నడూ లేని విధంగా పొట్టి ఫార్మాట్లో టీమిండియాకు ఇటీవల ఘోర పరాభవాలు ఎదురయ్యాయి. టీ20 ప్రపంచకప్ చాంపియన్గా ఐర్లాండ్ గడ్డ మీద అడుగుపెట్టిన భారత్.. పసికూన అయిన ఆతిథ్య జట్టు చేతిలో 2-0తో క్లీన్స్వీప్ అయింది.
తీవ్రస్థాయిలో విమర్శలు
అనంతరం ఇంగ్లండ్కు వెళ్లి అక్కడా ఆతిథ్య జట్టు చేతిలో 4-0తో వైట్వాష్కు గురైంది. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా తుదిజట్టులో తరచూ మార్పులు, వరల్డ్కప్ హీరో సంజూ శాంసన్ను పక్కనపెట్టడం విమర్శలకు కారణమయ్యాయి.
అంతేకాదు.. అంతకుముందు టీ20 జట్టు కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను నియమించే విషయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రధాన పాత్ర పోషించినట్లు.. హెడ్కోచ్ గౌతం గంభీర్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వరుస ఓటముల నేపథ్యంలో ఈ విషయం కూడా మరోసారి తెరమీదకు వచ్చింది.
దినేశ్ కార్తిక్ సంచలన వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్- అగార్కర్ మధ్య విభేదాల వల్లే భారత జట్టుకు ఈ దుస్థితి వచ్చిందని పరోక్షంగా దుయ్యబట్టాడు. వీరి వైఖరి కారణంగా ఆటగాళ్లలో ఒక రకమైన గందరగోళం నెలకొందని పేర్కొన్నాడు.
ఈ మేరకు.. ‘‘చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా పటిష్ట జట్టును తయారు చేయాలని భావిస్తున్నాడు. అయితే, కోచ్ గంభీర్ మాత్రం అలా కాదు. ప్రతి ఒక్క మ్యాచ్, ప్రతి ఒక్క సిరీస్ గెలవాలనే లక్ష్యంతో ఉన్నాడు.
ఆటగాళ్లకు మంచిది కాదు
ఒకరేమో దీర్ఘకాలిక ప్రయోజనాలు.. మరొకరు ఇప్పటికిప్పుడు వచ్చే ఫలితాల గురించి ఆలోచించడం వల్ల బహుశా ఇద్దరి మధ్య ఒక రకమైన ఘర్షణ జరిగి ఉంటుంది. దీంతో ఆటగాళ్ల మనసుల్లో గందరగోళం నెలకొంది. చీఫ్ సెలక్టర్, కోచ్ ఆలోచనల మధ్య వ్యత్యాసం ఆటగాళ్లకు మంచిదేనా? అంటే అస్సలు కాదనే చెప్తాను.
ఇలాంటి సమయంలో వారికి జట్టులో తమ స్థానం గురించి అభద్రతాభావం ఏర్పడుతుంది. అది ఫలితాలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ విభేదాలు పరిష్కరించుకుంటే జట్టుకు మంచిది’’ అని దినేశ్ కార్తిక్ చెప్పుకొచ్చాడు.


