IND Vs ENG: అత్యుత్తమ బౌలరే.. కానీ ఇప్పుడే జట్టులోకి అవసరమా? | Too Much of Risk This Week: Ex-England Captain On Archer Selection | Sakshi
Sakshi News home page

అత్యుత్తమ బౌలరే.. కానీ ఇప్పుడే జట్టులోకి అవసరమా?: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

Jun 27 2025 12:13 PM | Updated on Jun 27 2025 1:24 PM

Too Much of Risk This Week: Ex-England Captain On Archer Selection

టీమిండియాతో రెండో టెస్టుకు జోఫ్రా ఆర్చర్‌ (Jofra Archer)ను ఎంపిక చేయడాన్ని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుసేన్‌ విమర్శించాడు. ఈ పేస్‌ బౌలర్‌ను ఇప్పుడే ఆడించడం రిస్క్‌ అని మేనేజ్‌మెంట్‌ను హెచ్చరించాడు. పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధిస్తేనే అతడిని తుదిజట్టుకు ఎంపిక చేయాలని సూచించాడు.

1-0తో ముందంజలో ఇంగ్లండ్‌
కాగా ‘అండర్సన్‌–టెండూల్కర్‌ ట్రోఫీ’ (Tendulkar-Anderson Trophy) ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇరుజట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ జరుగనుంది. ఇందులో భాగంగా .. లీడ్స్‌ (Leeds Test)లో నువ్వా నేనా అన్నట్లు సాగిన తొలి పోరులో ఇంగ్లండ్‌ విజయం సాధించి  సిరీస్‌లో 1–0తో ముందంజ వేసింది. 

ఇక భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య బుధవారం (జూలై 2) నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగే మ్యాచ్‌ కోసం ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు... పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ను తీసుకుంది.

2021లో చివరగా..
గాయాలతో సహవాసం చేసే ఆర్చర్‌... 2021 తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. అతడు చివరగా... అహ్మదాబాద్‌ వేదిగా టీమిండియాపై టెస్టు మ్యాచ్‌ ఆడాడు. అనంతరం మోచేతి గాయంతో సుదీర్ఘ ఫార్మాట్‌కు దాదాపు దూరమయ్యాడు. ఇటీవలే మళ్లీ సంప్రదాయ క్రికెట్‌లో తిరిగి అడుగుపెట్టాడు.

కౌంటీ చాంపియన్‌షిప్‌ డివిజన్‌ వన్‌ మ్యాచ్‌లో ససెక్స్‌ జట్టు తరఫున బరిలోకి దిగిన అతడు.. దుర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. పద్దెనిమిది ఓవర్ల పాటు బౌలింగ్‌ చేసి దుర్హమ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఎమిలో గేను 37 పరుగుల వద్ద అవుట్‌ చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ తరఫున రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

ఆర్చర్‌ రాక గురించి ప్రస్తావిస్తూ ‘జాతీయ జట్టు తరఫున 13 టెస్టులు ఆడిన 30 ఏళ్ల జోఫ్రా ఆర్చర్‌ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడు. 2021 ఫిబ్రవరిలో భారత్‌పైనే చివరి టెస్టు ఆడిన అతడు... మళ్లీ టీమిండియాపైనే పునరాగమనం చేస్తున్నాడు’ అని ఇంగ్లండ్, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది.  

అత్యుత్తమ బౌలరే.. కానీ ఇప్పుడే జట్టులోకి అవసరమా?
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుసేన్‌ మాట్లాడుతూ.. ‘‘రానున్న వారం రోజుల్లో ఇంగ్లండ్‌ నిజంగానే పెద్ద రిస్క్‌ తీసుకోబోతోంది. ఇందులో వారు సఫలం అవుతారో లేదో తెలియదు. జోఫ్రా ఆర్చర్‌ ఫిట్‌నెస్‌ ఏ స్థాయిలో ఉందో నాకైతే తెలీదు.

అంతా బాగుంటే మంచిదే. అయినా, ఆర్చర్‌ కోసం ఇప్పుడు ఎవరిని జట్టు నుంచి తప్పిస్తారన్నదే ప్రశ్న?.. ఇప్పుడే జట్టులో మార్పులు అవసరం లేదనుకుంటా. ఆర్చర్‌ను ఆడించే విషయంలో లార్డ్స్‌ టెస్టు వరకు వేచి చూస్తే మంచిది’’ అని అభిప్రాయపడ్డాడు.

అదే విధంగా.. ‘‘అతడు ససెక్స్‌ తరఫున ఒకే ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడి తిరిగి వస్తున్నాడు. నాలుగేళ్లు టెస్టులకు దూరంగా ఉండి.. రీఎంట్రీలో కేవలం 18 ఓవర్లు బౌల్‌ చేశాడు. నిజంగానే ఆర్చర్‌ పూర్తి ఫిట్‌గా ఉండే ప్రపంచంలో అతడే అత్యుత్తమ బౌలర్‌ అని చెప్పడానికి సందేహించను.

అయితే, దురదృష్టవశాత్తూ గాయాల వల్ల సుదీర్ఘకాలంగా టెస్టు ఫార్మాట్‌కు అతడు దూరమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ’’ అని నాసిర్‌ హుసేన్‌ చెప్పుకొచ్చాడు.

కాగా టీమిండియాతో తొలి టెస్టులో క్రిస్‌ వోక్స్‌ ఒకే ఒక్క వికెట్‌ తీయగా.. బ్రైడన్‌ కార్స్‌, జోష్‌ టంగ్‌ కలిసి పదకొండు వికెట్లు కూల్చారు. అయితే, వోక్స్‌ పొదుపుగా బౌలింగ్‌ చేసిన కారణంగా అతడిని ఇప్పుడే జట్టు నుంచి తప్పించడం తొందరపాటు చర్యే అవుతుంది.

చదవండి: WI vs AUS: ఆసీస్‌కు చుక్కలు చూపిస్తున్న విండీస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement