
భారత లోయర్ ఆర్డర్ వైఫల్యంపై స్టోక్స్
ఓపెనర్లు గెలిపించారన్న ఇంగ్లండ్ కెప్టెన్
లీడ్స్: తొలి టెస్టులో భారత జట్టు లోయర్ ఆర్డర్ను కట్టడి చేయడం కూడా తమ విజయానికి ప్రధాన కారణమని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై కూడా తమ బౌలర్లు ప్రత్యర్థి చివరి వరుస బ్యాటర్లను తొందరగా అవుట్ చేయడంలో సఫలమయ్యారని అతను ప్రశంసించాడు. తొలి ఇన్నింగ్స్లో 41 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయిన భారత్... రెండో ఇన్నింగ్స్లో 31 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు చేజార్చుకుంది.
‘ఇరు జట్లు నమోదు చేసిన స్కోర్లు చూస్తే మంచి బ్యాటింగ్ పిచ్ అని అర్థమవుతోంది. అయితే ఈ మ్యాచ్లో పలు మలుపులున్నా అన్నింటికంటే ప్రధానమైన కారణం రెండుసార్లూ భారత్ లోయర్ ఆర్డర్ను మేం కట్టడి చేయడమే అని నేను భావిస్తున్నా. రెండో ఇన్నింగ్స్లో అయితే భారత్ స్కోరు కనీసం 500 వరకు చేరే అవకాశం కనిపించింది. అలా జరిగితే మాకు ఛేదన కష్టమయ్యేది. కానీ మా బౌలర్లు వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. చక్కటి ఆటతో పాటు ప్రతీ సెషన్లో మా ఆటగాళ్లు చూపిన పట్టుదల కూడా ప్రశంసనీయార్హం’ అని స్టోక్స్ అన్నాడు.
371 పరుగుల ఛేదనలో శుభారంభం అందించిన ఓపెనర్లు డకెట్, క్రాలీలను కెపె్టన్ ప్రత్యేకంగా అభినందించాడు. ముఖ్యంగా జడేజా బౌలింగ్లో డకెట్ రివర్స్ స్వీప్లతో భారీగా పరుగులు రాబట్టడం అద్భుతమని... అతని సలహాతోనే తాను కూడా స్పిన్ను ఎదుర్కొనేందుకు రివర్స్ స్వీప్ వైపే మొగ్గు చూపానని ఇంగ్లండ్ కెపె్టన్ చెప్పాడు. హెడింగ్లీ మైదానంలో సాధారణంగా అవుట్ఫీల్డ్ చాలా వేగంగా ఉంటుందని, అందుబాటులో ఉన్న ఓవర్లన్నీ ఆడగలిగితే తాము విజయం సాధిస్తామనే గట్టి నమ్మకంతో ఉన్నామన్న స్టోక్స్... టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న నిర్ణయం చివరకు తప్పు కాకపోవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.