PC: X
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత యువ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. కీలకమైన మూడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన పడిక్కల్ అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఓ దశలో తన తొలి డబుల్ సెంచరీ మార్క్ను అందుకునేలా కనిపించిన పడిక్కల్.. అనుహ్యంగా స్టంపౌటయ్యాడు.
మొత్తంగా ఈ కర్ణాటక బ్యాటర్ 230 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్తో 167 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పడిక్కల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. శ్రీలంకపై టెస్టుల్లో మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 150 ప్లస్ స్కోరు సాధించిన మూడో భారత బ్యాటర్గా పడిక్కల్ చరిత్ర సృష్టించాడు.
గతంలో టీమిండియా దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్(177), ఛెతేశ్వర్ పుజారా (153 పరుగులు) మూడో స్ధానంలో బ్యాటింగ్కు 150 కంటే ఎక్కువ పరుగులు చేశారు. ఇప్పుడు ఈ అరుదైన జాబితాలో పడిక్కల్ చేరాడు. అంతేకాకుండా స్వాతంత్య్ర దినోత్సవం రోజున టెస్టు సెంచరీ తొలి ప్లేయర్గా కూడా దేవ్ రికార్డులకెక్కాడు.
అలాగే 21వ శతాబ్దంలో టీమిండియా తరపున మూడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి టెస్ట్ సెంచరీ బాదిన రెండో ప్లేయర్గా పడిక్కల్ రికార్డులెక్కాడు. పడిక్కల్ కంటే ముందు సౌరవ్ గంగూలీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. సాయి సుదర్శన్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో వచ్చిన అవకాశాన్ని పడిక్కల్ అద్భుతంగా వినియోగించుకున్నాడు.
చదవండి: అస్సలు ఊహించలేదు.. ఇది అత్యంత అవమానకరం: పాంటింగ్


