భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పోలీసులను ఆశ్రయించాడు. తన గురించి అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇందుకు సంబంధించి కోల్కతా పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.
విమర్శలు ఓకే.. కానీ..
ఈ మేరకు.. ‘‘పబ్లిక్ ఫిగర్గా ఉన్నందువల్ల నా గురించి వచ్చే అభిప్రాయాలు, విమర్శలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. అయితే, అసత్య ప్రచారాలు చేయడం, పరువుకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం, ఉద్దేశపూర్వకంగానే నా ప్రతిష్టను దిగజార్చేలా రాతలు రాయడం చేస్తే అస్సలు ఆమోదించను.
ఆమోదయోగ్యనీయం కాదు
ఇలాంటి పనులు ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. ఈ విషయంలో చట్టపరంగా ముందుకు వెళ్లాలి అనుకుంటున్నాను. నా ఫిర్యాదు స్వీకరించి సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను’’ అని గంగూలీ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
కాగా ‘సౌరవ్ గంగూలీ ఫ్యాన్స్’ పేరిట ఉన్న ఫేస్బుక్ పేజీపై గంగూలీ ఫిర్యాదు చేశాడు. అదే విధంగా.. స్పోర్ట్జ్వికీ అనే ప్లాట్ఫామ్ గురించి కూడా తన ఫిర్యాదులో ప్రస్తావించాడు. ఈ రెండు ప్లాట్ఫామ్లలో తరచుగా తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు.
దిగ్గజ బ్యాటర్
కోల్కతాలో జన్మించిన గంగూలీ టీమిండియా తరఫున 1992లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ టెస్టుల్లో 7212, వన్డేల్లో 11363 పరుగులు సాధించాడు. భారత జట్టు కెప్టెన్గానూ పనిచేసిన గంగూలీని అభిమానులు ముద్దుగా ‘దాదా’ అని పిలుచుకుంటారు. కాగా గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగానూ పనిచేశాడు.


