మహిళల క్రికెట్ చరిత్రలో మరో అత్యుత్తమ సమరానికి తెరలేవబోతోంది. జూన్ 12 నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా వైస్కెప్టెన్ స్మృతి మంధాన సంచలన వ్యాఖ్యలు చేసింది.
ప్రపంచకప్ లాంటి మెగాటోర్నీ జరుగుతున్నా భారత్-పాక్ మధ్య మ్యాచ్కు మాత్రమే హైప్ ఉందని, మిగిలిన టోర్నీకి కూడా అదే స్థాయిలో ఆదరణ చూపాలని అభిమానులకు విజ్ఞప్తి ఆసక్తి కలిగించింది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్, హైప్ సహజమైనదే అయినప్పటికీ.. కేవలం ఆ ఒక్క మ్యాచ్కే పరిమితం కాకుండా టోర్నీ మొత్తానికి భారీ స్థాయిలో ప్రచారం కల్పించాలని ఆమె కోరారు.
మహిళల క్రికెట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందుతోందని, ప్రతి జట్టులోనూ అద్భుతమైన ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని ఆమె గుర్తుచేశారు. అభిమానులు, క్రీడా విశ్లేషకులు, మీడియా సంస్థలు కేవలం భారత్-పాక్ పోరుపైనే కాకుండా, టోర్నమెంట్లో జరిగే మిగిలిన అన్ని మ్యాచ్లపై కూడా అంతే శ్రద్ద పెట్టాలని, అప్పుడే మహిళల క్రికెట్కు నిజమైన గుర్తింపు దక్కుతుందని మంధాన అభిప్రాయపడ్డారు.
పురుషుల క్రికెట్తో సమానంగా తాము అద్భుతాలు చేస్తున్నప్పటికీ మహిళల క్రికెట్పై ఇంకా చిన్నచూపేనని పేర్కొన్నారు. స్మృతి మంధాన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ టోర్నీ విజయవంతం కావడానికి సోషల్ మీడియా పాత్ర కూడా ఎంతో కీలకమని, ప్రతీ మ్యాచ్ గురించి చర్చ జరగాలని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.
మంధాన చెప్పినట్లుగా కేవలం ఒకే ఒక్క హై-వోల్టేజ్ మ్యాచ్ టోర్నీని ముగించకుండా, ప్రతీ లీగ్ మ్యాచ్ను, ప్రతీ జట్టు ప్రదర్శనను హైలైట్ చేయడం వల్ల మహిళల క్రీడలకు మరింత వాణిజ్య పరమైన ఆదరణ, స్పాన్సర్షిప్ లభించే అవకాశం ఉంది. వరల్డ్కప్లో అందరి దృష్టిని ఆకర్షించే అత్యంత కీలకమైన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జూన్ 14న జరగనుంది.
ఇక ప్రపంచకప్లో పాల్గొంటున్న అన్ని జట్లు టైటిల్ గెలవడమే లక్ష్యంగా శిక్షణ తీసుకున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లతో పాటు భారత్, శ్రీలంక, పాకిస్తాన్ జట్లు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఈసారి ఎలాగైనా ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉంది.
గత కొన్ని సిరీస్లుగా భారత మహిళల జట్టు అద్భుతమైన ఫామ్లో కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ సమతూకంతో కనిపిస్తోంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లు జట్టులోకి రావడం జట్టు బలాన్ని మరింత పెంచింది.
చదవండి: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. బౌలింగ్లో మెరిసిన టీమిండియా స్టార్!


