రోహిత్ వివాదం.. టీమిండియాకు బీసీసీఐ కీలక ఆదేశాలు! | BCCI Urges Team India Players To Stay Away From Social Media Amid Rohit Sharma Retirement Rumours | Sakshi
Sakshi News home page

రోహిత్ వివాదం.. టీమిండియాకు బీసీసీఐ కీలక ఆదేశాలు!

Jul 19 2026 1:24 PM | Updated on Jul 19 2026 4:55 PM

BCCI-Advice-Team-India-Stay-Away-Social Media-Amid Rohit Chatters

Photo Credit: BCCI Twitter

రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్‌పై సోష‌ల్ మీడియాలో ఊహాగానాలు వ‌చ్చిన నేప‌థ్యంలో బీసీసీఐ టీమిండియా ఆట‌గాళ్ల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. మ్యాచ్‌లు ఉన్న స‌మ‌యంలో వీలైనంత మేర సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండ‌డం మంచిద‌ని ఆట‌గాళ్ల‌కు బీసీసీఐ సూచించింది. 

శ‌నివారం లండ‌న్‌లోని భార‌త హైక‌మిష‌న్ నిర్వ‌హించిన ప్ర‌వాస భార‌తీయుల స‌న్మాన కార్య‌క్ర‌మంలో భాగంగా టీమిండియాతో జ‌రిగిన ఇంట‌రాక్టివ్ సెష‌న్‌లో బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి టీమిండియా కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్, హెడ్ కోచ్ గంభీర్ సహా ఆట‌గాళ్లంతా హాజ‌ర‌య్యారు.

99 శాతం అదే ధోరణిలో: రాజీవ్‌ శుక్లా
రాజీవ్ శుక్లా మాట్లాడుతూ..'భారతదేశంలో 99 శాతం మంది ప్రజలు తమను తాము క్రికెట్ నిపుణులుగా భావిస్తుంటారని, అందుకే మ్యాచ్‌ల‌కు ముందు ఆట‌గాళ్లు సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండ‌డం మంచిద‌ని నా అభిప్రాయం. మన జట్టులో ప్రతిభకు కొదవలేదని, కేవలం ఆటపై దృష్టి పెట్ట‌డ‌మే ఆట‌గాళ్లు ముందున్న క‌ర్తవ్యం. అన‌వ‌స‌ర విష‌యాల‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం ఆట‌గాళ్ల‌కు లేదు.' అని చెప్పుకొచ్చారు.

బయటి విషయాలు పట్టించుకోను: గిల్‌
టీమిండియా కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ మాట్లాడుతూ.. తన చేతిలో లేని బయటి అంశాల గురించి ఆలోచించకుండా, కేవలం తన ఆటపైనే దృష్టి పెట్టడం వల్ల ఎలాంటి ఒత్తిడినైనా సులభంగా అధిగమించగలనని ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే టీమిండియాలో క్యాంప్‌లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి పుకార్లు షికార్లు చేస్తున్న వేళ గిల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇక గాయాల నుంచి కోలుకొని టీ20 కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన శ్రేయస్ అయ్యర్ తన పునరాగమన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు. తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు సహచర ఆటగాళ్లు చేసిన ఫోన్ కాల్స్, వారు ఇచ్చిన మద్దతు తనలో ఎంతో స్ఫూర్తిని నింపాయని, అందుకే మరింత బలంగా జట్టులోకి తిరిగి రాగలిగానని అయ్యర్ భావోద్వేగంతో పేర్కొన్నాడు. 

చారిత్రక బంధం: గంభీర్‌
ఇక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ భారత్-బ్రిటన్ మధ్య ఉన్న చారిత్రక సంబంధాల వల్ల యూకే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ప్రదేశమేనని అన్నారు. భారత క్రికెట్ అనేది కేవలం డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం కాదని, జట్టును బేషరతుగా ప్రేమించే ప్రతి ఒక్క నిజాయితీ గల అభిమానికి చెందుతుందని గంభీర్ స్పష్టం చేశాడు. 

ఇక ఈ వేడుకకు ఆతిథ్యమిచ్చిన యూకేలోని భారత హైకమిషనర్ పి. కుమారన్, డిప్యూటీ హైకమిషనర్ కార్తీక్ పాండేలు టీమిండియాకు ఘన స్వాగతం పలికారు. ఇదే వారంలో అమల్లోకి వచ్చిన భారత్-యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (CETA) వ్యాపారంతో పాటు క్రీడారంగానికి కూడా ఎన్నో కొత్త అవకాశాలను తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇన్నాళ్లూ టీమిండియా సాధించిన విజయాలు దేశానికి ఎంతో గర్వకారణమని వారు కొనియాడారు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇవాళ చివరి వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న ఇరుజట్లు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement