IND vs ENG: అందుకే అతడు బెంచ్‌కే పరిమితం: గిల్‌ | IND vs ENG 3rd ODI, Shubman Gill Reveals Reason Behind Kuldeep Yadav Not Playing In Decider, Read Story Inside | Sakshi
Sakshi News home page

IND vs ENG: అందుకే అతడు బెంచ్‌కే పరిమితం: గిల్‌

Jul 19 2026 4:39 PM | Updated on Jul 19 2026 5:35 PM

IND vs ENG 3rd ODI: Why Is Kuldeep Yadav Not Playing Gill Reveals

కేఎల్‌ రాహుల్‌తో కుల్దీప్‌ యాదవ్‌ (PC: BCCI X)

ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో భారత్‌ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది. ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌కు పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. రెండో వన్డే సందర్భంగా ఎడమ మోకాలు ఉబ్బిపోవడం వల్ల అతడు లార్డ్స్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడని ప్రకటన విడుదల చేసింది.

కుల్దీప్‌ను ఆడిస్తారనుకుంటే..
ఇక స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కూడా రెండో వన్డే సందర్భంగానే గాయపడ్డాడు. దీంతో అతడి స్థానాన్ని బీసీసీఐ హర్ష్‌ దూబేతో భర్తీ చేసింది. అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. ఇదిలా ఉంటే.. వాషీ దూరం కావడంతో.. అతడి స్థానంలో చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ మూడో వన్డే ఆడతాడని అంతా భావించారు.

కానీ యాజమాన్యం మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషీకి బదులు.. పేస్‌ బౌలర్‌ ప్రిన్స్‌ యాదవ్‌కు తుదిజట్టులో చోటు ఇచ్చింది. దీంతో కుల్దీప్‌ యాదవ్‌కు మరోసారి అన్యాయం చేశారంటూ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, టాస్‌ సమయంలో టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఈ విషయం గురించి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాడు. ‘‘బుమ్రా మోకాలి గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. వాషింగ్టన్‌ సుందర్‌ కూడా గాయపడ్డాడు. శివం దూబే కూడా ఈ మ్యాచ్‌ ఆడటం లేదు.

అందుకే అతడు బెంచ్‌కు పరిమితం
ఈ ముగ్గురి స్థానాల్లో కేఎల్‌ రాహుల్‌, ప్రిన్స్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ తుదిజట్టులోకి వచ్చారు. మేము లార్డ్స్‌ మైదానంలో నలుగురు సీమర్లను ఆడించాలని నిర్ణయించుకున్నాము. ఫాస్ట్‌ బౌలర్లతో పోలిస్తే స్పిన్నర్లు ఇక్కడ మధ్య ఓవర్లలో పెద్దగా ప్రభావం చూపరు అనిపించింది’’ అని గిల్‌ పేర్కొన్నాడు. తద్వారా కుల్దీప్‌ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని పరోక్షంగా వెల్లడించాడు.

వైట్‌వాష్‌ల తర్వాత..
కాగా యూకే పర్యటనలో భాగంగా టీమిండియా తొలుత ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో తలపడి.. ఆతిథ్య జట్టు చేతిలో కనీవినీ ఎరుగని రీతిలో 2-0తో క్లీన్‌స్వీప్‌ అయింది. అనంతరం ఇంగ్లండ్‌ చేతిలో టీ20 సిరీస్‌లో 4-0తో వైట్‌వాష్‌ అయింది. ఈ క్రమంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికి భారత్‌- ఇంగ్లండ్‌ చెరో వన్డే గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. 

ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి నిర్ణయాత్మక మూడో వన్డేకు లార్డ్స్‌ మైదానం ఆతిథ్యమిస్తుండగా.. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ నలుగురు పేసర్లు గుర్నూర్‌ బ్రార్‌, ప్రిన్స్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్‌ కృష్ణను ఆడిస్తోంది.

ఇంగ్లండ్‌తో మూడో వన్డేకు భారత తుదిజట్టు
రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌, గుర్నూర్‌ బ్రార్‌, ప్రిన్స్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్‌ కృష్ణ.

చదవండి: టీమిండియాకు భారీ షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement