PC: BCCI X
ఇంగ్లండ్తో మూడో వన్డేకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్కు దూరమైనట్లు తెలిపింది. అతడి స్థానంలో హర్ష్ దూబేను ఎంపిక చేసినట్లు శనివారం ప్రకటించింది. కాగా మూడు వన్డేల సిరీస్లో ఇంగ్లండ్- భారత్ చెరో విజయం సాధించి 1-1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే.
అర్ధ శతకాలతో రాణించి
తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (80)తో కలిసి ఆల్రౌండర్లు అక్షర్ పటేల్ (52), వాషింగ్టన్ సుందర్ (57 )జట్టును గెలిపించారు. ఇద్దరూ అజేయ అర్ధ శతకాలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్లో వాషీ సిక్సర్ బాది విజయ లాంఛనం పూర్తి చేశాడు.
గాయపడ్డ వాషీ
అయితే, రెండో వన్డేలో మాత్రం బ్యాటింగ్ పరంగా అక్షర్ (1)తో పాటు వాషీ (2) పూర్తిగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా వాషీ గాయపడ్డాడు. అతడి చీలమండకు గాయమైంది. దీంతో అతడు బౌలింగ్కు రాలేదు. తాజా సమాచారం ప్రకారం అతడి గాయం తీవ్రమైనట్లు తెలుస్తోంది.
జట్టులోకి హర్ష్ దూబే
ఈ నేపథ్యంలోనే వాషీ స్థానంలో యువ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ హర్ష్ దూబేను బీసీసీఐ ఎంపిక చేసింది. కాగా మహారాష్ట్రకు చెందిన హర్ష్ దూబే.. ఇటీవల అఫ్గానిస్తాన్తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.
ఇప్పటికి రెండు వన్డేలు ఆడిన లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ ప్లేయర్.. నాలుగు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఆదివారం నాటి నిర్ణయాత్మక మూడో వన్డేకు లార్డ్స్ వేదిక.


