Photo Credit: FIFA Twitter
ఫిఫా ప్రపంచకప్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక ఫిఫా పైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్ తలపడనున్నాయి. అయితే మ్యాచ్లో గెలిచిన జట్టు ఫిఫా టైటిల్ సొంతం చేసుకోవడంతో పాటు ఆటగాళ్లు మెడల్స్ అందుకోనున్నారు. విన్నర్ జట్టుకు లభించే ప్రైజ్మనీనే భారీగా ఉంటుంది. ఒక్కో ఆటగాడు భారీ మొత్తాన్ని దక్కించుకుంటారు.
ఈసారి ఫిఫా ప్రపంచకప్లో విజేతగా నిలిచిన జట్టులోని ఆటగాళ్లకు 96 ఏళ్ల ఫుట్బాల్ ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి ఫిఫా ప్రత్యేక గిఫ్ట్ అందించనుంది. ఫిఫా 2026లో చాంపియన్గా నిలిచిన జట్టు ఆటగాళ్లకు ఉంగరాలు ప్రదానం చేయనున్నారు. టైటిల్ గెలిచిన జట్లకు ఉంగరాలు ఇవ్వడం నార్త్ అమెరికాలో 19వ శతాబ్దం నుంచి ఒక సంప్రదాయంగా వస్తోంది.
ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఫిఫా గెలిచిన జట్టులోని ఆటగాళ్లుకు 30 ప్రత్యేక ఉంగరాలను ఇప్పటికే తయారు చేయించి ఉంచారు. నార్త్ అమెరికా సంప్రదాయం ప్రకారం గెలిచిన జట్టు గుర్తింపును ప్రతిబింబించేలా ఈ ఉంగరాలను ఆటగాళ్ల వేలికి తొడగనున్నట్లు ఫిఫా తెలిపింది. అయితే ఆ ఉంగరాల ధర ఎంత ఉంటుందనేది మాత్రం ఫిఫా వెల్లడించలేదు.
1893 నుంచి రింగుల ప్రదానం
నార్త్ అమెరికాలో చాంపియన్లుగా నిలిచిన జట్లు లేదా వ్యక్తులకు రింగుల ప్రదాన సంప్రదాయం అనేది 1893 నుంచి కొనసాగుతోంది. ఆ సంవత్సరంలో మాంట్రియల్ హాకీ క్లబ్కు డొమినియన్ హాకీ ఛాలెంజ్ కప్ లభించింది. దీనినే ఇప్పుడు స్టాన్లీ కప్ అని పిలుస్తారు. ఆ జట్టు పైభాగంలో చిన్న హాకీ స్టిక్లు జతచేయబడిన సాధారణ పట్టీలను కూడా తయారు చేయించుకుంది.
ఇక మేజర్ లీగ్ బేస్బాల్ జట్లు 1920ల్లో ఛాంపియన్షిప్ రింగులను ఇవ్వడం ప్రారంభించగా.. నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) ఛాంపియన్షిప్లో మాత్రం 1940 నుంచి ఆ టోర్నీలో విజేతగా నిలిచిన జట్లకు రింగులను అందిస్తూ వస్తున్నారు. 1960ల నుంచి కొనసాగుతున్న సూపర్ బౌల్ శకంలో విజేతగా నిలిచిన ఎన్ఎఫ్ఎల్ జట్లు రింగులు అందుకుంటున్నాయి.
జట్లతో పాటు వివిధ క్రీడల్లో హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న దిగ్గజాలతో పాటు ప్రపంచ వేదికపై తమ దేశానికి (నార్త్ అమెరికా) ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లకు కూడా లభించే ప్రోత్సాహక ప్యాకేజీలో భాగంగా యూఎస్ ఒలింపియన్లు, పారాలింపియన్లు ఉంగరాలను అందుకోవడం ఆనవాయితీగా వస్తోంది.


