ఫిఫా ప్రపంచకప్-2026లో ఫైనల్కు చేరాలన్న కల నెరవేరకపోయినా, టోర్నీని విజయంతో ముగించాలని ఫ్రాన్స్, ఇంగ్లండ్ జట్లు పట్టుదలగా ఉన్నాయి. శనివారం జరిగే మూడో స్థానం ప్లే-ఆఫ్ మ్యాచ్లో ఈ రెండు యూరోపియన్ దిగ్గజాలు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ అర్దరాత్రి (జులై 19) 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.
సెమీఫైనల్లో స్పెయిన్ చేతిలో ఫ్రాన్స్, అర్జెంటీనా చేతిలో ఇంగ్లండ్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ (మూడో స్థానం) ఆడాల్సి రావడం తమకు ఎంతమాత్రం ఇష్టం లేదని ఇరు జట్ల ఆటగాళ్లు, కోచ్లు స్పష్టం చేశారు.
"ఈ మ్యాచ్ ఆడాలని ఎవరూ కోరుకోలేదు"
ఫ్రాన్స్ డిఫెండర్ ఇబ్రహిమా కొనాటే మాట్లాడుతూ, "మేమంతా ఫైనల్లో ఆడాలని అనుకున్నాం. కానీ పరిస్థితులు ఇలా మారాయి. ఇప్పుడు మూడో స్థానం కోసం అయినా గెలిచి టోర్నీని ముగించాలని చూస్తున్నాం" అని తెలిపాడు.
తుచెల్పై విమర్శలు.. జట్టులో మార్పులు
అర్జెంటీనాతో సెమీఫైనల్లో వ్యూహాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఇంగ్లండ్ కోచ్ థామస్ తుచెల్, ఈ మ్యాచ్లో జట్టులో మార్పులు చేస్తామని వెల్లడించారు.
"ఈ మ్యాచ్ ఆడాలని ఎవరికీ ఉండదు. కానీ ఇది ప్రపంచకప్ అధికారిక మ్యాచ్. గత 60 ఏళ్లలో ఇంగ్లండ్కు ఇదే అత్యుత్తమ ప్రపంచకప్ ఫలితం సాధించే అవకాశం. ఆటగాళ్ల పోరాట పటిమను మరోసారి చూపించాల్సిన సమయం ఇది" అని తుచెల్ అన్నారు.
సెమీఫైనల్లో చివరి నిమిషాల్లో ఆధిక్యాన్ని కోల్పోవడంపై బాధ్యత తనదేనని కూడా ఆయన అంగీకరించారు.
గోల్డెన్ బూట్ రేసులో ఎంబపే
ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబపే ఈ మ్యాచ్లో మరో లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 8 గోల్స్ చేసిన అతడు అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీతో సమానంగా ఉన్నాడు. అయితే నాలుగు అసిస్టులతో మెస్సీ ఆధిక్యంలో ఉన్నాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు హ్యారీ కేన్, జూడ్ బెల్లింగ్హామ్ తలో ఆరు గోల్స్తో పోటీలో ఉన్నారు.
ఇదిలా ఉంటే, అర్జెంటీనా-స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఆదివారం మధ్యరాత్రి (సోమవారం) 12:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్త క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


