ఐర్లాండ్ సిరీస్లో వైభవ్ సూర్యవంశీకి టీమిండియా అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వకపోవడంపై పెద్ద వివాదం నడుస్తోంది. ఆ సిరీస్లో వైభవ్ తప్పక అరంగేట్రం చేస్తాడని అందరూ అనుకున్నా, చివరికి అతనికి ప్లేయింగ్ XIలో చోటు దక్కలేదు. దీంతో టీమిండియా మేనేజ్మెంట్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ వివాదంలోకి రాజకీయ నాయకులు కూడా ఎంటయ్యారు. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వైభవ్ను ఐర్లాండ్ సిరీస్లో ఆడించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రేయస్ అయ్యర్, గౌతమ్ గంభీర్ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు సూచించినా వైభవ్ను తుది జట్టులోకి తీసుకోలేదంటూ టీమిండియా మేనేజ్మెంట్పై ధ్వజమెత్తారు. ఓ ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ పేపర్ స్టేట్మెంట్ను సోషల్మీడియాలో ట్యాగ్ చేస్తూ టీమిండియా సిస్టమ్పై అసహనం వ్యక్తం చేశారు.
గిరిరాజ్ సింగ్ చేసిన రచ్చపై టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తాజాగా స్పందించాడు. ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ముందు మీడియాతో మాట్లాడుతూ..
తాను సోషల్ మీడియా లేదా న్యూస్ ఛానల్స్లో వచ్చే ఒత్తిడిని పట్టించుకోనని, జట్టు అవసరాలు మరియు ప్రదర్శన ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నాడు. దీంతో వైభవ్ అరంగేట్రంపై వస్తున్న రాజకీయ ఒత్తిడిని నేరుగా తిప్పికొట్టాడు.
ఇదిలా ఉంటే, ఇవాళ ఇంగ్లండ్తో జరుగబోయే తొలి టీ20లోనూ వైభవ్ అరంగేట్రం అనుమానమేనని తెలుస్తోంది. భారత మేనేజ్మెంట్, కోచ్, కెప్టెన్ అందరూ ముక్తకంఠంతో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్కు వత్తాసు పలుకుతున్నారు. దీన్ని బట్టి నేటి మ్యాచ్లోనూ వైభవ్ అరంగేట్రం లేనట్లే అన్న విషయం స్పష్టమవుతుంది. ఈ లెక్కన వైభవ్ అరంగేట్రం కోసం మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.


