జై షా, బీసీసీఐతో మాట్లాడాను.. వారికి నేనే చెప్పాను: సచిన్‌ టెండుల్కర్‌ | Sachin Breaks Silence On Pataudi Trophy Row Says Did All I Could To | Sakshi
Sakshi News home page

జై షా, బీసీసీఐతో మాట్లాడాను.. వారికి నేనే చెప్పాను: సచిన్‌ టెండుల్కర్‌

Jun 19 2025 3:33 PM | Updated on Jun 19 2025 5:09 PM

Sachin Breaks Silence On Pataudi Trophy Row Says Did All I Could To

‘పటౌడీ ట్రోఫీ’ పేరు మార్పు అంశంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI), ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ECB)దే తుది నిర్ణయమని టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar) అన్నాడు. అయితే, పటౌడీ వారసత్వాన్ని కొనసాగించేలా విజేత జట్టు కెప్టెన్‌కు.. పటౌడీ మెడల్‌ అందించేలా తాను చేసిన ప్రయత్నం సఫలమైనందుకు సంతోషంగా ఉందన్నాడు.

ఈసీబీ తీరుపై విమర్శలు
కాగా భారత్‌- ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్ల‍ మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు పటౌడీ ట్రోఫీ అనే పేరు ఉండేది. అయితే, తాజాగా సిరీస్‌ నేపథ్యంలో ఈ పేరును టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీగా మార్చారు. ఈ నేపథ్యంలో ఈసీబీ తీరుపై విమర్శలు వచ్చాయి.

అయినప్పటికీ తన నిర్ణయానికి కట్టుబడి ఇరు దేశాల దిగ్గజ ఆటగాళ్ల పేర్లు గుర్తుకు వచ్చేలా టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీ పేరును ఈసీబీ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో పటౌడీ గౌరవం తగ్గకుండా ఏదో ఒక రూపంలో వారిని గౌరవించేలా నిర్ణయం తీసుకోవాలంటూ సచిన్‌ టెండుల్కర్‌ ఈసీబీకి విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఇందుకు సానుకూలంగా స్పందించిన ఈసీబీ భారత్‌- ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌లో విజేతగా నిలిచిన జట్టు కెప్టెన్‌కు పటౌడీ మెడల్‌ అందజేస్తామని వెల్లడించింది. ఈ అంశాలపై సచిన్‌ టెండుల్కర్‌ తాజాగా స్పందించాడు.

జై షా, బీసీసీఐ, ఈసీబీతో  మాట్లాడాను
‘‘పటౌడీ వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోవాలి. భారత క్రికెట్‌కు పటౌడీ కుటుంబం చేసిన సేవలు మనకు స్ఫూర్తిదాయకం. వారి పేరుకు భంగం కలగకుండా.. లెగసీ కొనసాగేలా నా వంతు ప్రయత్నం చేస్తానని పటౌడీ ఫ్యామిలీకి చెప్పాను.

ఐసీసీ చైర్మన్‌ జై షా, బీసీసీఐ, ఈసీబీతో ఈ విషయం గురించి మాట్లాడాను. నా ఆలోచనలను వారితో పంచుకున్నాను. ఈ క్రమంలోనే విన్నింగ్‌ కెప్టెన్‌కు పటౌడీ మెడల్‌ ఇవ్వాలనే నిర్ణయం జరిగింది.

ఇరుజట్ల మధ్య ఏదేని ట్రోఫీ రిటైర్‌ చేయడంపై బీసీసీఐ, ఈసీబీలదే తుది నిర్ణయం. అయితే, పటౌడీ పేరును ఏదో ఒక రూపంలో కొనసాగించేలా చేయాలన్న నా ప్రయత్నం ఫలించింది’’ అని బోరియా మజుందార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్‌ టెండుల్కర్‌ పేర్కొన్నాడు.

కాగా టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య శుక్రవారం (జూన్‌ 20) నుంచి లీడ్స్‌ వేదికగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌తో భారత టెస్టు జట్టు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ శకం మొదలుకానుంది. రవిచంద్రన్‌ అశ్విన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి రిటైర్మెంట్‌ తర్వాత టీమిండియా ఆడబోయే తొలి టెస్టు సిరీస్‌ ఇదే కావడంతో.. టీమిండియా ప్రదర్శనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పటౌడీ ఫ్యామిలీ గౌరవార్థం
కాగా టీమిండియా అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీకి పేరుంది. ఆయన ససెక్స్‌, ఆక్స్‌ఫర్డ్‌ జట్ల తరఫున కూడా క్రికెట్‌ ఆడారు. ఇక మన్సూర్‌ తండ్రి ఇఫ్తికార్‌ అలీ ఖాన్‌ పటౌడీ కూడా టీమిండియా, ఇంగ్లండ్‌ జట్లకు ఆడటం విశేషం. 

ఈ నేపథ్యంలోనే వారి గౌరవార్థం భారత్‌- ఇంగ్లండ్‌ జట్ల మధ్య టెస్టు సిరీస్‌ను పటౌడీ ట్రోఫీగా పిలిచారు. కాగా మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ భార్య షర్మిలా ఠాగూర్‌. ఆమె బాలీవుడ్‌ నటి. వీరి సంతానం సైఫ్‌ అలీ ఖాన్‌, సోహా అలీఖాన్‌ కూడా బాలీవుడ్‌ నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. సైఫ్‌ కుమార్తె సారా అలీ ఖాన్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది.

చదవండి: ’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement