పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఓ ఘోర తప్పిదం జరిగింది. బ్రాడ్కాస్టర్ చేసిన ఓ భారీ పొరపాటు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాక్ ఆటగాళ్ల గణాంకాలు చూపాల్సిన సమయంలో, స్క్రీన్పై భారత క్రికెటర్ల పేర్లు కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
పాక్-బంగ్లా మధ్య తొలి టెస్ట్ మే 8న షేర్-ఏ బంగ్లా స్టేడియం వేదికగా ప్రారంభమైంది. రెండో రోజు ఆట సందర్భంగా బ్రాడ్కాస్టర్ పాక్ జట్టు టెస్ట్ గణాంకాలను ప్రదర్శించే గ్రాఫిక్ను చూపించింది. అయితే అందులో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, అర్షదీప్ సింగ్ తదితర భారత ఆటగాళ్ల పేర్లు కనిపించాయి.
ఈ తప్పిదం వెంటనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులు మీమ్స్, సరదా కామెంట్లతో బ్రాడ్కాస్టర్ను ట్రోల్ చేశారు. కొందరు ఐపీఎల్ మోడ్లోనే గ్రాఫిక్స్ తయారు చేశారా..? అంటూ సెటైర్లు వేశారు. మరోవైపు పాక్ అభిమానులు మాత్రం ఇది సాధారణ తప్పిదం కాదని, నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసింది. కెప్టెన్ నజ్ముల్ హొసేన్ షాంటో అద్భుత సెంచరీతో జట్టును నిలబెట్టాడు. మొమినుల్ హక్ 91, ముష్ఫికర్ రహీం 71 పరుగులతో కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 413 పరుగులకు ఆలౌటైంది.
పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ ఐదు వికెట్లతో మెరవగా.. షాహీన్ అఫ్రిది 3, హసన్ అలీ, నౌమన్ అలీ తలో వికెట్ తీశారు. కాగా, ఈ మ్యాచ్కు పాక్ స్టార్ బ్యాటర్ గాయం కారణంగా దూరమయ్యాడు.


