
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను భారత జట్టు ఓటమితో ఆరంభించింది. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ తొలి నాలుగు రోజులు ఆతిథ్య జట్టుపై అధిపత్యం చెలాయించిన టీమిండియా.. కీలకమైన ఆఖరి రోజు మాత్రం తేలిపోయింది.
371 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత బౌలర్లు డిఫెండ్ చేసుకుపోలేకపోయారు. శార్ధూల్ ఠాకూర్, ప్రసిద్ద్ కృష్ణ తలా రెండు వికెట్లు సాధించగా.. రవీంద్ర జడేజా ఒక్క వికెట్ సాధించాడు. మిగితా బౌలర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు.
అయితే సెకెండ్ ఇన్నింగ్స్లో బుమ్రా ఒక్క వికెట్ తీయకపోయినప్పటికి.. తొలి ఇన్నింగ్స్లో మాత్రం బుమ్రా ఒంటరి పోరాటం చేశాడు. ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ను ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
బుమ్రాకు విశ్రాంతి..!
కాగా బుమ్రా వర్క్ లోడ్ను దృష్టిలో పెట్టుకుని రెండో టెస్టుకు అతడికి విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మెనెజ్మెంట్ భావిస్తోంది. ఈ సిరీస్లో బుమ్రా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడుతాడని టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గంభీర్ అండ్ కోకు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) కీలక సూచనలు చేశాడు.
"సెకెండ్ టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
ఎందుకంటే బుమ్రా లేకపోతే ఆ మ్యాచ్లో భారత్ ఓడిపోయే అవకాశం ఉంది. అప్పుడు 2-0 తేడాతో వెనకబడితే సిరీస్ విజయం సాధించడం కష్టతరమవుతుంది.
లీడ్స్ టెస్టులో ఓటమిని భారత జట్టు జీర్ణించుకోలేదు. గెలిచేందుకు అవకాశమున్న మ్యాచ్లో వారు ఓడిపోయారు. ఫీల్డింగ్లో చేసిన తప్పిదాలతో ఇంగ్లండ్కు గెలిచే అవకాశం కల్పించారు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి.
అదేవిధంగా టెయిలాండర్ల నుంచి భారత్కు బ్యాటింగ్ సపోర్ట్ కావాలి" అని స్కై స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాస్త్రి పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్- భారత్ మధ్య రెండో టెస్టు వచ్చే బుధవారం నుంచి ఎడ్జ్బాస్టన్ వేదికగా జరగనుంది.
చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్