ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్‌ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్‌ | Ind vs Eng: Gambhir Refuses To Blame One Player For Team India Defeat | Sakshi
Sakshi News home page

ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్‌ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్‌

Jun 25 2025 10:51 AM | Updated on Jun 25 2025 11:13 AM

Ind vs Eng: Gambhir Refuses To Blame One Player For Team India Defeat

ఇంగ్లండ్‌తో టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీని టీమిండియా పరాజయంతో ప్రారంభించింది. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టు (Ind vs Eng 1st Test)లో ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు ఐదు సెంచరీలు సాధించినప్పటికీ భారత్‌కు చేదు అనుభవమే మిగిలింది.

బ్యాటింగ్‌లో లోయర్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలం కావడం.. ఫీల్డర్ల బౌలర్ల వైఫల్యం తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో గిల్‌ సేన ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir)మాత్రం జట్టుకు అండగా నిలిచాడు. ఏ ఒక్కరిని నిందించేందుకు తాను సిద్ధంగా లేనని.. గెలిచినా, ఓడినా ఆటగాళ్లంతా ఒక్కటిగా ఉంటారని పేర్కొన్నాడు.

అంతా కలిసి కేవలం తొమ్మిది పరుగులే
కాగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో భారత లోయర్‌ ఆర్డర్‌ (8-11 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చినవాళ్లు) అంతా కలిసి కేవలం తొమ్మిది పరుగులే చేసింది. ఈ విషయం గురించి ప్రస్తావన రాగా.. ‘‘కొన్నిసార్లు కొందరు విఫలమవుతారు. నిరాశ కలిగించే విషయమే అయినా మరేం పర్లేదు.

అయితే, అందరి కంటే ఎక్కువ సదరు ఆటగాళ్లే ఎక్కువ నిరాశకు లోనవుతారు. ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని వారికి తెలుసు. ఒకవేళ మొదటి ఇన్నింగ్స్‌లో మేము 570- 580 పరుగులు చేసినట్లయితే మా ఆధిపత్యమే కొనసాగేది.

ప్రతి ఒక్కరు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. అయితే, అన్నిసార్లూ అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోవచ్చు. స్పెషలిస్టు బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. అంతమాత్రాన ఏ ఒక్కరినో వేరు చేసి నిందించాల్సిన పనిలేదు.

ఈ మ్యాచ్‌లో మేము గెలిచే సందర్భాలు కూడా ఎన్నో వచ్చాయి. కానీ దురదృష్టవశాత్తూ పని పూర్తి చేయలేకపోయాం. ఏదేమైనా గెలిచినా, ఓడినా ఒక్కటే. కలిస్తే గెలుస్తాం.. కలిసే ఓడిపోతాం’’ అని గంభీర్‌ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.

కెప్టెన్‌ నిర్ణయం ప్రకారమే అలా చేశాం
ఇక శార్దూల్‌ ఠాకూర్‌ (Shardul Thakur) గురించి ప్రశ్నించగా.. ‘‘అతడిని మేము స్పెషలిస్టు బౌలర్‌గా జట్టులోకి తీసుకోలేదు. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గానే తీసుకున్నాం. కొన్నిసార్లు కెప్టెన్‌ నిర్ణయంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది’’ అని గంభీర్‌ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో శార్దూల్‌ రెండు వికెట్లు మాత్రమే తీశాడు. అదే విధంగా.. 1, 4 పరుగులు స్కోర్‌ చేశాడు.

కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సైకిల్‌ను టీమిండియా ఇంగ్లండ్‌తో సిరీస్‌తో మొదలుపెట్టింది. ఐదు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లిన భారత జట్టు.. హెడింగ్లీ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లోనే ఓడిపోయింది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ ఈ సిరీస్‌తో తన ప్రయాణం మొదలుపెట్టగా.. ఓటమి కారణంగా నిరాశే ఎదురైంది.

ఇక ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (101), కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (147), వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (134) సెంచరీలు బాదారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (137)తో పాటు రిషభ్‌ పంత్‌ (118) శతక్కొట్టాడు.

టీమిండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ తొలి టెస్టు స్కోర్లు
టీమిండియా: 471 & 364
ఇంగ్లండ్‌: 465 & 373/5.

చదవండి: వారి వల్లే ఓడిపోయాము.. అందుకు ఇంకా సమయం ఉంది: గిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement