
టీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన ప్రయాణాన్ని ఓటమితో ఆరంభించాడు. టెండూల్కర్- అండర్సన్ ట్రోఫీ 2025లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. బ్యాటింగ్లో భారత జట్టు అద్భుతంగా రాణించినప్పటికి బౌలింగ్, ఫీల్డింగ్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచింది.
మొదటి నాలుగు రోజుల ఆటలో ఇంగ్లండ్పై ఆధిపత్యం చెలాయించిన టీమిండియా.. ఆఖరి రోజు ఆటలో మాత్రం తేలిపోయింది. 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి ఊదిపడేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(149) భారీ సెంచరీతో కదం తొక్కగా.. జాక్ క్రాలీ(65), జో రూట్(53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు సాధించగా.. రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టాడు.
ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ గిల్ స్పందించాడు. చెత్త ఫీల్డింగ్ కారణంగానే తాము ఓడిపోయామని గిల్ చెప్పుకొచ్చాడు.
"టెస్టు మ్యాచ్ అద్భుతంగా సాగింది. మాకూ మంచి అవకాశాలు వచ్చాయి. అయితే క్యాచ్లు వదిలేయడం, లోయర్ ఆర్డర్లో ఎక్కువ పరుగులు చేయలేకపోవడం ఓటమికి కారణాలు. నాలుగో రోజు కూడా కనీసం 430 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాలని అనుకున్నాం.
అయితే 25 పరుగులకే చివర్లో వరుసగా వికెట్లు పడటంతో అది సాధ్యం కాలేదు. ఈ రోజు కూడా తొలి వికెట్ తీసిన తర్వాత మాకు మంచి అవకాశం ఉందనిపించింది. కానీ అది జరగలేదు. తొలి సెషన్లో మేం బాగానే బౌలింగ్ చేసి వారిని నియంత్రించగలిగినా ఒక్కసారి బంతి పాతబడిన తర్వాత ఏమీ చేయలేకపోయాం. అలాంటి స్థితిలోనూ వికెట్లు తీయడం అవసరం.
జడేజా చాలా బాగా బౌలింగ్ చేసి మంచి అవకాశాలు సృష్టించాడు. మొదటి ఇన్నింగ్స్లో అనూహ్యంగా కుప్పకూలడంపై ఇప్పటికే చర్చించాం. ఈ తప్పును మేం మున్ముందు సరిదిద్దుకోవాలి. ఇలాంటి పిచ్పై అవకాశాలు అంత సులువుగా రావు.
వాటిని వృథా చేసుకోవద్దు. అయితే మాది యువ జట్టు. నేర్చుకునే దశలో ఉంది. మరింత మెరుగువుతాం. బుమ్రా మిగిలిన టెస్టుల్లో ఏవి ఆడతాడో ఇప్పుడే చెప్పలేం. దానికి తగినంత సమయం ఉంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో గిల్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs ENG: టీమిండియా అత్యంత చెత్త రికార్డు.. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే