తొలి టెస్టులో చోటుకోసం కుల్దీప్‌ మాస్టర్‌ ప్లాన్‌! | Kuldeep Yadav Batting Practice Instead Bowling-Ahead Vs SL 1st Test | Sakshi
Sakshi News home page

SL Vs IND: తొలి టెస్టులో చోటుకోసం కుల్దీప్‌ మాస్టర్‌ ప్లాన్‌!

Aug 5 2026 3:58 PM | Updated on Aug 5 2026 5:04 PM

Kuldeep Yadav Batting Practice Instead Bowling-Ahead Vs SL 1st Test

Photo Credit: BCCI Twitter

శ్రీలంకతో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులో చోటు కోసం మాస్టర్‌ప్లాన్‌ వేసినట్లు అనిపిస్తోంది. తొలి టెస్టుకు సంబంధించి తుది జట్టును ప్రకటించినప్పటికీ, కుల్దీప్ తొలి టెస్టులో ఆడుతాడా లేదా అనేది అనుమానమే. ఈ నేపథ్యంలో లంక గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా బృందం ఇప్పటికే కొలంబో మైదానంలో ప్రాక్టీస్‌ను ఆరంభించింది. 

ఈ ప్రాక్టీస్‌లో కుల్దీప్ తన శైలికి భిన్నంగా బంతితో కాకుండా బ్యాట్‌తో ప్రాక్టీస్ చేయడం విశేషం. దాదాపు 40 నిమిషాల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ కొనసాగించిన కుల్దీప్ ఒక్కసారి కూడా బౌలింగ్ వేయలేదు. అయితే తొలి టెస్టులో కుల్దీప్‌కు చోటు దక్కడం అనుమానంగా ఉండడంతో జట్టులో బ్యాటర్‌గానైనా చాన్స్‌ అందుకోవాలనే బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

టీమిండియాను వరుస గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే హర్షిత్ రానా, వాషింగ్టన్ సుందర్ గాయాలతో దూరమవ్వగా, ఫిట్‌నెస్ టెస్టు పాసైనప్పటికీ బుమ్రా కూడా చివరి నిమిషంలో లంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో లంకతో సిరీస్‌కు కుల్దీప్ ఎంపికైనప్పటికీ, ఆప్షనల్‌గా కనిపించాడు. 

ఇప్పుడు టీమిండియాను గాయాలు వెంటాడడంతో కుల్దీప్ తొలి టెస్టు ఆడే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలనుకుంటే మాత్రం జడేజాతో కలిసి కుల్దీప్ బౌలింగ్‌ను పంచుకోనున్నాడు. అంతేకాదు కుల్దీప్ యాదవ్‌కు టెస్టుల్లో బ్యాటింగ్‌లోనూ మంచి రికార్డే ఉంది. 

ఈ మణికట్టు స్పిన్నర్ ఇప్పటివరకు 18 టెస్టుల్లో 234 పరుగులు సాధించాడు. 40 పరుగులు అతడి అత్యుత్తమంగా ఉంది. అయితే తొలి టెస్టులో కుల్దీప్ చోటు దక్కించుకుంటాడా లేదా అన్నది జట్టు ప్రకటన వరకు ఎదురుచూడాల్సిందే.  అయితే లంకతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత జట్టు కొలంబో వేదికగా మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇక తొలి టెస్టు ఆగస్టు 15న గాలే వేదికగా, రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా జరగనున్నాయి.

లంకతో టెస్టు సిరీస్ భారత్‌కు కీలకమైంది. వచ్చే ఏడాది జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే లంకపై సిరీస్ గెలవడం తప్పనిసరి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉండగా, లంక ఆరో స్థానంలో కొనసాగుతోంది.

చదవండి: శకం ముగిసింది.. డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈకి స్టార్ రెజ్ల‌ర్ గుడ్ బై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement